బిగ్ షాక్: కొత్త గ్యాస్ కనెక్షన్ లు నిలిపివేత.. LPG గ్యాస్ సిలిండర్ రూల్స్ లో భారీ మార్పులు..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగూతూనే ఉన్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా బృందాలు రెండో దశ చర్చలు జరిపేందుకు సిద్ధం అవుతున్నా.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా భారత్ లో ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దాంతో ఎల్పీజీ సరఫరాలోనూ అంతరాయం కలిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. కొత్త గ్యాస్ కనెక్షన్ లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న కస్టమర్లకు నిరంతరం గ్యాస్ సరఫరాను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
హార్మూజ్ జలసంధి మూసివేతతో భారత్ లో పరిస్థితులు తారుమారయ్యాయి. ముడి చమురు సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అరబ్ దేశాల నుంచే భారత్ అత్యధికంగా చమురు, గ్యాస్ ను దిగుమతి చేసుకుంటుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభం కాకముందు చమురు, గ్యాస్ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధి గుండా సులభంగా భారత్ కు చేరేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమెరికా, ఇరాన్ సైన్యం హార్మూజ్ నుంచి నౌకలను పంపించడం లేదు. దాంతో చమరు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే ఆ ప్రభావం భారత్ లోని వంట గ్యాస్ సరఫరాపైనా పడింది. దాంతో ప్రభుత్వ చమురు, గ్యాస్ సంస్థలు కొత్త గ్యాస్ కనెక్షన్లు జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఒక నెల రోజుల పాటు కొత్త గ్యాస్ కనెక్షన్స్ జారీ చేయకుండా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇది తాత్కాలిక నిలిపివేత మాత్రమేనని ఒక్కసారి దేశంలో పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఈ నిబంధనను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇక భారత్ కు ప్రతి ఏటా 3.3 కోట్ల టన్నుల LPG అవసరం పడుతోంది. ఇందులో దాదాపు 65 శాతం దిగుమతుల నుంచే భారత్ కు చేరుతుంది. అది కూడా అరబ్ దేశాలనుంచే.. ఈ దిగుమతులకు హార్మూజ్ జలసంధి కీలకంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జలసంధిని మూసివేసిన కారణంగా LPG ట్యాంకర్లు భారత్ కు వచ్చేందుకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దాంతో భారత్ లోని గ్యాస్ సరఫరాపై ఆందోళన నెలకొంది. సరఫరాలో అంతరాయం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు తమ వద్ద ఉన్న లక్ష్యం ఒక్కటేనని.. ప్రస్తుత కస్టమర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా గ్యాస్ సరఫరా చేయడమేనని తెలిపాయి. అందువల్ల కొత్త గ్యాస్ కనెక్షన్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశాయి. అయితే ఇది కొద్దిరోజులు మాత్రమే ఉంటుందని అన్నాయి.

ఇక కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలోని 94 శాతం LPG సిలిండర్లు అథెంటికేషన్ కోడ్ సిస్టమ్ ద్వారా డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నా దేశంలో ఇప్పటివరకూ LPG, PNG, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications