దేశాన్ని శాసిస్తున్న చిన్న గ్రామం.. 51 మంది ఐఏఎస్, ఐపీఎస్లు!
ఒకవైపు దేశంలోని యువత ఐఏఎస్, ఐపీఎస్ లక్ష్యంగా ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ లక్షలు పోసి తిరుగుతుంటే.. మరోవైపు ఏ కోచింగ్ సెంటర్ తో పనిలేకుండా, కేవలం 75 కుటుంబాలున్న ఒక చిన్న గ్రామం ఏకంగా 51 మంది అధికారులను దేశానికి అందించింది. ఉత్తరప్రదేశ్లోని మాధోపట్టి గ్రామం ఇప్పుడు భారతదేశపు 'ఐఏఎస్ ఫ్యాక్టరీ'గా పిలవబడుతోంది. ప్రతి ఇంటి నుంచి ఒక అధికారిని తయారు చేస్తున్న ఈ గ్రామం గురించి స్పెషల్ స్టోరీ..
యూపీలోని జౌన్పూర్ జిల్లాలో ఉన్న మాధోపట్టి గ్రామంలో అడుగుపెడితే, మీరు ఏ వీధిలో నడిచినా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లేదా ప్రస్తుతం విధుల్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి కనిపిస్తారు. కేవలం 75 ఇళ్లు ఉన్న ఈ చిన్న గ్రామం ఇప్పటివరకు 51 మందికి పైగా సివిల్ సర్వెంట్లను అందించిందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ ఊరిని దేశమంతా 'అధికారుల గ్రామం' అని గౌరవంగా పిలుచుకుంటుంది.

ఒకే ఇంటి నుంచి నలుగురు ఐఏఎస్లు!
ఈ గ్రామ చరిత్రలో అత్యంత అద్భుతమైన ఘనత ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సోదరులు ఐఏఎస్ అధికారులు కావడం. 1955 బ్యాచ్కు చెందిన వినయ్ కుమార్ సింగ్ మొదలుకొని.. ఆయన సోదరులు ఛత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్, శశికాంత్ సింగ్ అంతా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. వీరిలో వినయ్ కుమార్ సింగ్ బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) స్థాయికి ఎదిగి పదవీ విరమణ చేశారు. ఈ అన్నదమ్ముల విజయం గ్రామంలోని ప్రతి బిడ్డలోనూ 'నేను కూడా కలెక్టర్ అవ్వాలి' అనే కసిని పెంచింది.
బ్రిటిష్ కాలం నుంచే విద్యా విప్లవం
మాధోపట్టిలో ఈ విద్యా సంప్రదాయం నిన్న మొన్న మొదలైంది కాదు. 1914లో ముస్తఫా హుస్సేన్.. బ్రిటిష్ కాలంలోనే సివిల్ సర్వీస్లో చేరడం ద్వారా ఈ విజయగాథకు పునాది వేశారు. ఆ తర్వాత 1952లో ప్రకాష్ సింగ్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఇలా తరం మారుతున్నా, ఈ ఊరి రక్తంలో పారే చదువుల దాహం మాత్రం తగ్గలేదు. 2002లో అమితాబ్ సింగ్ 298వ ర్యాంక్ సాధించి ఈ పరంపరను కొనసాగించారు.
కోచింగ్ సెంటర్లు లేవు.. కానీ గైడెన్స్ పుష్కలం!
సాధారణంగా సివిల్స్ సాధించాలంటే పెద్ద నగరాల్లోని కోచింగ్ సెంటర్లలో లక్షలు ఖర్చు చేయాలి. కానీ మాధోపట్టి యువతకు ఆ అవసరం లేదు. అక్కడ ఏసీ గదుల కోచింగ్ సెంటర్లు లేవు.. కానీ అంతకంటే విలువైన సీనియర్ అధికారుల మార్గదర్శకత్వం ఉంది. సెలవుల్లో గ్రామానికి వచ్చే ఉన్నతాధికారులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. జిల్లా కలెక్టర్ కూడా తమ పక్కింటి వ్యక్తే అనే భావన ఉండటంతో, విద్యార్థులకు ఆ పరీక్షలు చూసి భయం కలగదు.
ఈ గ్రామ ప్రతిభ కేవలం కలెక్టర్ కార్యాలయాలకే పరిమితం కాలేదు. ఇక్కడి యువత దేశ గర్వకారణమైన ఇస్రో (ISRO), భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC), ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలలో కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యా వాతావరణం, పెద్దల ప్రోత్సాహం ఉంటే దేన్నైనా సాధించవచ్చని మాధోపట్టి నిరూపిస్తోంది.












Click it and Unblock the Notifications