మెడికల్ సీట్ల పేరుతో మోసగిస్తారు.. జాగ్రత్త అంటున్న సీపీ సజ్జనార్
మే 3వ తేదీన నీట్ యూజీ పరీక్ష జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు ముఖ్య హెచ్చరిక జారీ చేశారు. నీట్ పరీక్ష తర్వాత మెడికల్ సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేసే ముఠాల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో ఆయన చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.
మెడిసిన్ సీట్ల పేరుతో మోసాలు.. సీపీ సజ్జనార్ అలెర్ట్
చాలామంది మెడిసిన్ చేయాలన్న ఆలోచనతో నీట్ పరీక్ష రాస్తారని, అయితే నీట్ లో తక్కువ మార్కులు వస్తే, మేనేజ్మెంట్ కోటాలో తక్కువ ధరకు సీట్లు ఇస్తామని మోసగాళ్లు మాయ చేస్తారని ఆయన పేర్కొన్నారు. పిల్లలను మెడిసిన్ చేయించాలన్న ఆలోచన ఉన్న తల్లిదండ్రులను టార్గెట్ చేసుకొని లక్షల కోట్ల రూపాయల మోసం జరుగుతోందని, విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఆ దేశాల్లో ఎంబీబీఎస్ పై జాగ్రత్త
వైద్య వృత్తిపై ఉన్న గౌరవాన్ని ఆసరాగా చేసుకుని దళారులు, తల్లిదండ్రులను ఏమారుస్తూ లక్షల రూపాయలు కాజేస్తున్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. చైనా, కిర్గిజ్స్థాన్, కజక్స్థాన్, జార్జియా, ఆర్మేనియా, కరీబియన్ వంటి దేశాల్లో తక్కువ ఖర్చుతో MBBS చదవవచ్చు అని ఆశ చూపి మోసం చేస్తున్నారన్నారు.
తల్లిదండ్రులకు సజ్జనార్ హెచ్చరిక
మీరు ఏ యూనివర్సిటీలో చదవాలనుకున్నా ముందు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గుర్తింపు ఉందా లేదా అని అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించారు. సీట్ల పేరుతో డబ్బు అడిగితే వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సిపి సజ్జనార్ తెలిపారు.నీట్ పరీక్ష తర్వాత మెడికల్ సీట్ల మోసాలు పెరిగే అవకాశం ఉందని సీపీ సజ్జనార్ తల్లిదండ్రులను హెచ్చరించారు.
ఆన్ లైన్ మోసాలే కాకుండా, ఆఫ్ లైన్ మోసాలపైన అలెర్ట్
ఎవరూ మోసగాళ్ల ఉచ్చులో పడకూడదని, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకూడదు అని సజ్జనార్ సూచించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా ద్వారా సమాజంలో జరిగే అనేక మోసాలపై సీపీ సజ్జనార్ ఎప్పటికప్పుడు ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు. ఆన్ లైన్ మోసాలే కాకుండా, ఆఫ్ లైన్ మోసాలపైన కూడా అలెర్ట్ చేస్తూ ప్రజలను మోసాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications