తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్.. అధికారిక ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం అయ్యారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. 1991 బ్యాచ్ కు చెందిన సీవీ ఆనంద్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీ అయ్యారు. ఇక పోలీసు శాఖలో వివిధ కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అటు పోలీస్ అధికారిగా మాత్రమే కాకుండా.. మాజీ క్రికెటర్ గానూ సీవీ ఆనంద్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఆయన రెండు సార్లు పనిచేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా కూడా తన సేవలను అందించారు.
ఆ సమయంలో సినిమా పైరసీ ముఠాను పట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం ఆరుగురు డీజీపీలుగా పనిచేశారు. వారిలో కేవలం ఇద్దరు మాత్రమే పూర్తికాలపు డీజీపీలుగా సేవలందించారు. తెలంగాణ తొలి డీజీపీగా అనురాగ్ శర్మ పూర్తికాలం పనిచేయగా.. ఆ తర్వాత మహేందర్ రెడ్డి కూడా పూర్తికాలం పాటు డీజీపీగా సేవలందించారు. ఇప్పుడు సీవీ ఆనంద్ తెలంగాణకు మూడో పూర్తి కాలపు డీజీపీ కానున్నారు.
ఇక సీవీ ఆనంద్ 1968లో రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఆయన విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఎకాడమిక్స్ తో పాటు క్రికెటర్ గానూ సీవీ ఆనంద్ కు మంచి గుర్తింపు ఉంది. ఆయన క్రికెటర్ గా అండర్-19, అండర్-22 స్థాయిల్లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడారు. అలా అండర్-19 జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత సివిల్స్ లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలు పెట్టి 1990 లో 147 వ ర్యాంకు సాధించారు సీవీ ఆనంద్. 1993లో వరంగల్ రూరల్ ఏఎస్పీగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత నిజామాబాద్ ఎస్పీగా ప్రొమోట్ అయ్యారు. నిజామాబాద్ ప్రాంతంలో నక్సలైట్ల నిర్మూలన కోసం నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.












Click it and Unblock the Notifications