నమ్మించి గొంతు కోసింది! మాజీ ఐపీఎస్ భార్య దారుణ హత్య
ఆ ఇల్లు మూడు అంతస్తుల మేడ.. హై సెక్యూరిటీ జోన్.. నిరంతరం నిఘా నీడన ఉండే ప్రాంతం. కానీ, శుక్రవారం తెల్లవారుజామున అక్కడ జరిగిన ఒక ఘోరం ఉలిక్కిపడేలా చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ (55) తన స్వగృహంలోనే శవమై కనిపించడం పెను సంచలనం సృష్టించింది. కేవలం ఒక హత్యగానే కాకుండా, అత్యంత పక్కా ప్లాన్తో జరిగిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెనుక ఉన్నది ఎవరో తెలిసి పోలీసులు సైతం విస్తుపోయారు.
రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ వ్యక్తిగత పనిపై బెంగళూరు వెళ్లడంతో తనూజ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అదే నిందితులకు అవకాశంగా మారింది. పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, అర్థరాత్రి 1 గంట సమయంలో నిందితులు ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న తనూజ నోట్లో గుడ్డలు కుక్కి, ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. అనంతరం ఇంట్లో ఉన్న భారీగా బంగారం, నగదు దోచుకుని మాయమయ్యారు. ఉదయం పరిసరాల్లో అనుమానాస్పద కదలికలు గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

వెన్నుపోటు పొడిచిన 'నమ్మకం'!
ఈ కేసులో ప్రధాన నిందితురాలు మరెవరో కాదు.. ఆ ఇంట్లో గత ఎనిమిది నెలలుగా పనిమనిషిగా ఉన్న కల్పన. యజమాని ఒంటరిగా ఉన్న సమయం చూసి, తన నేపాలీ ముఠా సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం దోపిడీ కోసమే కాదు, పక్కా స్కెచ్తో ఈ హత్యకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ సాక్ష్యాలు చెబుతున్నాయి. కల్పనతో పాటు మరో ముగ్గురు సభ్యులు ఈ నేరంలో పాల్గొన్నట్లు సీపీ సజ్జనార్ ధృవీకరించారు.
నేపాలీ ముఠాల పంజా.. సీపీ వార్నింగ్!
ఘటనా స్థలిని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. ''నేపాలీ పనిమనుషులను చేర్చుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ ముఠాలు బెంగళూరు, ముంబయి, పుణె వంటి నగరాల్లో ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్నాయి'' అని ఆయన హెచ్చరించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు, నగరం నలుమూలలా జల్లెడ పడుతున్నారు.
ఒక ఐపీఎస్ అధికారి భార్యకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు స్థానికుల్లో వ్యక్తమవుతోంది. పరారీలో ఉన్న కల్పన మరియు ఆమె ముఠా పట్టుబడితేనే ఈ హత్య వెనుక ఉన్న మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications