తుమ్మిడిహట్టిపై సీఎం కీలక నిర్ణయం.. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ ఫిక్స్
తెలంగాణలోని సాగునీటి రంగంలో కీలకమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించి, సుమారు 100 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గతంలో ఈ బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని భావించినప్పటికీ, ముంపు ఎక్కువగా ఉంటుందని మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, 148 మీటర్ల వద్ద నీటి తరలింపు కష్టతరమని నిపుణులు తేల్చారు. మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తున బ్యారేజీని నిర్మిస్తే, మహారాష్ట్రలో ముంపు ప్రభావం అతి తక్కువగా ఉంటుందని ఇంజినీరింగ్ నిపుణులు సూచించారు. దీనివల్ల తక్కువ వ్యయంతో గురుత్వాకర్షణ (Gravity) ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించే అవకాశం ఉంది.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం
మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో 148 మీటర్ల ఎత్తుకే అంగీకరించిన నేపథ్యంలో, ఇప్పుడు 150 మీటర్ల ప్రతిపాదనను ఒప్పించేందుకు రాజకీయ దౌత్యం అవసరమని సీఎం భావించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సహకారాన్ని కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాయాలని, స్వయంగా కలిసి మాట్లాడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
గత నిధుల వినియోగం - ప్రాజెక్ట్ ప్రాధాన్యత
ప్రాణహిత-చేవెళ్ల పథకంపై ఇప్పటికే సుమారు రూ.11,000 కోట్లు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 71.5 కి.మీ మేర కాలువ నిర్మాణం పూర్తయింది. బ్యారేజీ ఎత్తు పెంచడం వల్ల మహారాష్ట్రలో ఎక్కడైనా ముంపు వాటిల్లితే, బాధితులకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మేడిగడ్డ మరమ్మతులపై సమీక్ష..
తుమ్మిడిహట్టితో పాటు మేడిగడ్డ బ్యారేజీ పనుల పైనా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. రుతుపవనాలు ప్రారంభమై వర్షాలు కురిసేలోపు జియో-టెస్టింగ్ ప్రక్రియను, అవసరమైన మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తుమ్మిడిహట్టి నుంచి నీటి మళ్లింపు కోసం ఎత్తిపోతల (Lift) పథకమా లేక సొరంగమా (Tunnel) అన్న విషయంపై బ్యారేజీ పనులు ప్రారంభమైన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని అధికారులకు సూచించారు.














Click it and Unblock the Notifications