వైజాగ్ లో డేటా సెంటర్ అందుకే .. ! తేల్చేసిన గూగుల్.. !
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ను ఏర్పాటు చేయడానికి గూగుల్ $15 బిలియన్లు పెట్టుబడి పెడుతోంది. తాజాగా ఈ ఒప్పందంపై ఢిల్లీలో సంతకాలు కూడా జరిగాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాకతో నగరంతో పాటు రాష్ట్రంలోనూ భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో అసలు విశాఖలో ఏఐ డేటా సెంటర్ పెట్టేందుకు ముందుకు రావడం వెనుక కారణాన్ని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ రెవెన్యూ ప్రెసిడెంట్ వెల్లడించారు.
బీ2బీ,బీ2సీ రంగాలలోని భారతీయ కంపెనీల నుండి డేటా మరియు ఏఐ సొల్యూషన్లకు వేగంగా పెరుగుతున్న డిమాండ్ తాము విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు కారణమైందని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ రెవెన్యూ ప్రెసిడెంట్ మాట్ రెన్నర్ ఇవాళ తెలిపారు. బారత్ కీలకమైన వృద్ధి మార్కెట్గా పరిగణిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక నియంత్రణ, కస్టమర్ అవసరాలను తీర్చడానికి వ్యాపారాలకు అధునాతన, సార్వభౌమ పరిష్కారాలు అవసరమన్నారు.

ముఖ్యంగా భారత్ యొక్క అభివృద్ధి చెందుతున్న సంస్థ, వినియోగదారు మార్కెట్లలో గూగుల్ మౌలిక సదుపాయాల విస్తరణ ఏఐ సామర్థ్యాల కోసం ఈ విస్తృత, విభిన్న డిమాండ్ తీర్చడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వెల్లడింంచారు. తద్వారా భారత్ లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలోనే తాము ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మాట్ రెన్నర్ స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్ లో కంపెనీలు ఏఐ వాడకాన్ని బాగా పెంచేశాయి. తద్వారా ఉద్యోగులకు సైతం లేఆఫ్ లు ప్రకటిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చాక కంపెనీలకు ఏఐ సేవలు అందించడం మొదలుపెడితే భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. అయితే భారత్ లో కంపెనీలు ఇక్కడి నుంచే సేవలు అందుకోవడం ప్రారంభిస్తే ఖర్చు తగ్గుతుందన్న భావన కూడా ఉంది. దీంతో గూగుల్ డేటా సెంటర్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్వానిస్తున్నాయి.












Click it and Unblock the Notifications