కేజ్రీవాల్ కేబినెట్: డిప్యూటీ సీఎంగా సిసోడియా, వీరికి చోటు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కలిపి 11 మందితో కేబినెట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు ఆపార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ.. తాజా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
వీరితో పాటు జితేంద్ర తోమర్, కపిల్ శర్మ, సందీప్ కుమార్, సతేందర్ జైన్, అసిం అహ్మాద్ ఖాన్కు చోటు దక్కే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడే కేబినెట్లో గతంలో మంత్రులుగా పనిచేసిన ముగ్గురికి అవకాశం లభించనుంది.
సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్ తిరిగి కేబినెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. రాఖీ బిద్లాన్ లు, గిరీశ్ సోనీ, సోమ్ నాథ్ భారతీలకు కేబినెట్ లో ఈసారి చోటు దక్కకపోవచ్చునని భావిస్తున్నారు.