AP DSC 2024: ఎన్నికల తర్వాతే ఏపీ డీఎస్సీ ? కొత్త షెడ్యూల్ ఆలస్యంతో..
ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నాలుగేళ్లుగా మౌనంగా ఉండిపోయిన ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటన చేసింది. కేవలం 50 రోజుల వ్యవధిలో టెట్, డీఎస్సీ పరీక్షలు పూర్తి చేయాలని భావించింది. కానీ టెట్ పరీక్షలకూ, డీఎస్సీ పరీక్షలకూ మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలన్న సుప్రీంకోర్టు గత ఉత్తర్వుల ఆధారంగా అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించడం, ఆ మేరకు హైకోర్టు ఈ వాదనతో ఏకీభవించి షెడ్యూల్ సస్పెండ్ చేయడం జరిగిపోయాయి.
హైకోర్టు తీర్పు తర్వాత డీఎస్సీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పూర్తిగా మౌనం వహించడం అభ్యర్ధుల్లో టెన్షన్ పెంచుతోంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ మార్చి 14న టెట్ ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో 15 నుంచి పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ షెడ్యూల్ రద్దయింది. కాబట్టి టెట్ పరీక్షల ఫలితాలు వెలువడే మార్చి 14 తర్వాత నెల రోజుల గ్యాప్ ఇచ్చి డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు.

మరో ఐదు రోజుల్లో టెట్ పరీక్ష ఫలితాలు రాబోతున్నాయి. ఆ తర్వాత నుంచి నెల రోజుల గడువు అంటే ఏప్రిల్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ అలా జరిగినా డీఎస్సీ పరీక్షలు పూర్తయి ఫలితాలు ప్రకటించే సరికి మే నెల వచ్చేస్తోంది. దీంతో ఎన్నికలకు ముందు డీఎస్సీ నిర్వహించి ఫలితాలు వెల్లడించాలన్న ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాక డీఎస్సీ పరీక్షల నిర్వహణకు వీలుగా షెడ్యూల్ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో విద్యాశాఖ ఓ క్లారిటీ ఇవ్వబోతోంది.












Click it and Unblock the Notifications