డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. వారికి ఫీజు మినహాయింపు..
ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి ప్రభుత్వం ఓ శుభవార్తను అందించింది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 'మెగా డీఎస్సీ'లో ఫీజు మినహాయింపు ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నాయుడు తెలిపారు. ఈ నెల 2వ తేదిన సచివాలయంలో ఏపీటెట్, డీఎస్సీ నిర్వహణపై అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండాలని, 'మెగా డీఎస్సీ'ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
వీటితో పాటు టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించాలని అధికారులకు సూచింఆరు. ఇక టెట్ సిలబస్ మార్పు అంటూ వస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన స్పష్టం చేశారు. సిలబస్ లో ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలిపారు. టెట్ సిలబస్ వివరాలకు అభ్యర్థులు ఈ వెబ్సైట్ను https://aptet.apcfss.in సందర్శించాలని కోరారు. డీఎస్సీ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలని మంత్రి నారాలోకేష్ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117పై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులు మంత్రి ఆదేశించారు. మెగా డీఎస్సీలో వయోపరిమితి సడలింపులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి నారాలోకేష్ సూచించారు.

జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులివే..
రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్లో భాగంగా ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇందులో పాఠశాల విద్యా శాఖ పరిధిలో మొత్తం 13,661 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 టీచర్ పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 భర్తీకానున్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. శ్రీకాకుళం 543, విజయనగరం, 583, విశాఖపట్నం 1,134, తూర్పుగోదావరి 1,346, పశ్చిమ గోదావరి 1,067, కృష్ణా 1,213, గుంటూరు 1,159, ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1,478, కడప, 709, అనంతపురం 811, కర్నూలు 2,678 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications