UGC NET పరీక్షలు వాయిదా: అనివార్య కారణాలట
Joint CSIR-UGC-NET Examination June 2024: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. గుజరాత్లో 10 లక్షల రూపాయలకు నీట్ పరీక్ష పేపర్లను అమ్ముకున్నారంటూ వార్తలు రావడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, 1,563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు కలవడం వంటి వివాదాలు నీట్ పరీక్షలను చుట్టుముట్టాయి.
నీట్ కౌన్సెలింగ్ను రద్దు చేయాలంటూ పలువురు అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అటు ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడం వంటి పరిణామాలు వేగంగా సంభవిస్తోన్నాయి. కౌన్సెలింగ్ను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

ఈ పరిస్థితుల మధ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ను వాయిదా వేసింది. అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు వివరించింది. పేపర్ లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తం కావడమే దీనికి కారణమని చెబుతున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి.
ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. జులై 25 నుంచి 27వ తేదీ వరకు ఈ జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ- ఎన్ఈటీ పరీక్షలు జరగాల్సి ఉంది. అనివార్య పరిస్థితులతో పాటు లాజిస్టిక్ సమస్యల కారణంగా వాయిదా వేసినట్లు ఎన్టీఏ తెలిపింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ను జారీ చేసింది.
కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మేథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ కంప్యూటర్ ఫార్మాట్లల్లో ఈ పరీక్షలు ఉంటాయి. సంవత్సరానికి రెండుసార్లు వీటిని నిర్వహిస్తుంది ఎన్టీఏ. వీటిల్లో స్కోర్ సాధించిన వాళ్లు ఐఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సహా వివిధ కళాశాలల్లో పీహెచ్డీ కోర్సుల్లో జాయిన్ అవ్వొచ్చు.
రెండు లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఈ పరీక్షల పేపర్ కూడా లీక్ అయినట్లు ఎన్టీఏ భావిస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా పరీక్షలను వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది ఈ సర్కులర్లో పొందుపర్చలేదు. ఈ వరుస ఉదంతాలతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications