పవన్ - సింగీతం కాంబోలో మూవీ.. ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆగిపోవడానికి కారణం ఇదే ???
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ వైపు రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రజల మన్ననలు పొందుతూ.. మరోవైపు సినిమాల్లో కూడా భారీ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత లాయల్ ఫ్యాన్బేస్ కలిగిన హీరోల్లో ఒకరు అనడంలో సందేహం లేదు. హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజమే కానీ పవన్ కళ్యాణ్కు ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోల్లోనే అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు హిట్ అయ్యినా, ఫ్లాప్ అయినా అభిమానుల ఎనర్జీ మాత్రం ఎప్పటికీ తగ్గదు. అందుకే పవన్ కళ్యాణ్ పేరు ఒక బ్రాండ్గా మారిపోయింది. ఆయన చూడని బాక్సాఫీస్ రికార్డులు లేవనే చెప్పాలి.
ఇప్పటికే తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసేసి మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముందుగా "హరిహర వీరమల్లు" చిత్రంతో నిరాశపరిస్తే.. "ఓజీ" మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్ గానే "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రంతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. కాగా పవన్ కెరీర్లో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తే.. మరికొన్ని ప్రాజెక్టులు మాత్రం అనౌన్స్మెంట్ దశలోనే ఆగిపోయాయి. అలాంటి వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'ప్రిన్స్ ఆఫ్ పీస్'. 2010లో అఫీషియల్గా అనౌన్స్ చేసిన ఈ చిత్రం.. కనీసం సెట్స్పైకి కూడా వెళ్లకుండానే నిలిచిపోయింది.

ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో.. కొండా కృష్ణంరాజు నిర్మాతగా ప్లాన్ చేసిన చిత్రమిది. యేసుక్రీస్తు జీవితం, ఆయన చేసిన అద్భుతాలు.. సమాజానికి ఆయన అందించిన సందేశాల నేపథ్యంతో కథను సిద్ధం చేశారు. ఈ స్టోరీని పకడ్బందీగా తెరకెక్కించడం.. సింగీతం, రచయిత జె.కె. భారవి కలిసి దాదాపు రెండేళ్ల పాటు రీసెర్చ్ కూడా చేశారు. బైబిల్తో పాటు క్రీస్తు జీవితానికి సంబంధించిన ఎన్నో చారిత్రక గ్రంథాలను లోతుగా అధ్యయనం చేసి స్క్రిప్ట్ను సిద్ధం చేశారు.
ఇందులో పవన్ తో పాటు అనుష్క శెట్టి దేవదూత లాంటి పాత్రలో నటించాల్సి ఉంది. ఇంటర్నేషనల్ స్థాయిలో రూపొందించడం కోసం బెత్లహేం, జెరూసలేం వంటి ప్రదేశాలలో చిత్ర బృందం లొకేషన్ రికీ కూడా నిర్వహించింది. అయితే ఆయన చేసేది పూర్తి స్థాయి జీసస్ పాత్ర కాదని, కథను మలుపు తిప్పే ఒక అత్యంత కీలకమైన ప్రత్యేక పాత్ర అని దర్శకుడు సింగీతం ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా హిందీ, తమిళం, మలయాళంతో పాటు ఇంగ్లీష్ భాషలోనూ ఒక అంతర్జాతీయ స్థాయి పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందించాలని ప్లాన్ చేశారు. పవన్ కూడా ఈ సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్నారు.
కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగి త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందనుకున్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ ఊహించని విధంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. మొదట అనుకున్న బడ్జెట్ కంటే, ఇంటర్నేషనల్ లొకేషన్లు, విజువల్స్ కోసం అంచనా వేసిన నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. అంత బడ్జెట్ను భరించడం కష్టమని నిర్మాత భావించగా, దర్శకుడు సింగీతం కూడా అదే అభిప్రాయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ తర్వాత వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోవడంతో ఆ చిత్రం సెట్స్పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.












Click it and Unblock the Notifications