ఏపీలో టెన్త్ పరీక్షలు ప్రారంభం-మిగిలిన వారికి ఒంటిపూట బడులు..!
ఏపీలో పదో తరగతి పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. దాదాపు 6 లక్షల మంది విద్యార్ధులు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు తరలివెళ్లారు. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో విద్యార్దులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారుల్ని, సిబ్బందిని ఆదేశించింది. అలాగే పదో తరగతి విద్యార్ధులకు హాజరవుతున్న విద్యార్దులకు పలు సూచనలు కూడా చేసింది.
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకునే అవకాశం కల్పించారు. ఇలా డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై హెడ్మాస్టర్ల సంతకాలు లేకపోయినా విద్యార్ధులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 3473 కేంద్రాల్లో ఇవాళ ఏకకాలంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్ధులతో పాటు గతంలో ఫెయిలై పరీక్ష రాస్తున్న మరో లక్ష మంది వరకూ పరీక్షలు రాస్తున్నారు.

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ అంటే మూడు గంటల పాటు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్ని గుర్తించి సీసీ టీవీ కెమెరా వంటి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. మాల్ ప్రాక్టీస్ ను అరికట్టేందుకు రాష్ట్రంలో తొలిసారిగా పదో తరగతి ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ ను ముద్రించారు. ఇన్విజిలేటర్లు, విద్యార్ధులు పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లతో పాటు మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.
మరోవైపు పదో తరగతి మినహా మిగిలిన క్లాసులకు ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో ప్రతీ ఏటా మార్చి 15 నుంచే వేసవి దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా.. ఈసారి మాత్రం వేసవి తీవ్రత తక్కువగా ఉందన్న కారణంతో మూడు రోజులు ఆలస్యంగా ఇవాళ్టి నుంచి ఒంటిపూట నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా తరగతుల విద్యార్ధులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ మాత్రమే తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications