మా మామ డిప్యూటీ సీఎం- మొక్కులు తీర్చుకున్న మెగా హీరో
Pawan Kalyan: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఫలితంగా క్యూలైన్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటోన్నారు.
శుక్రవారం నాడు 66,782 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 36,229 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 3.71 కోట్ల రూపాయల ఆదాయం అందింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

కాగా- ప్రముఖ నటుడు, మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్.. తిరుమలకు వచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. తన మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారాయన. పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఈ ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు.
మొన్నీ మధ్య ఆయన మేనమామ పవన్ కల్యాణ్.. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి భారీ మెజారిటీ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వంగ గీతాను 70 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో కొలువుదీరిన తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి కేబినెట్లో కీలక హోదాను పొందారు పవన్ కల్యాణ్. ఉప ముఖ్యమంత్రిగా నియమితులు అయ్యారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఆయనకు కేటాయించారు.
తన మేనమామ పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవడం, ఉప ముఖ్యమంత్రి హోదాను పొందడంతో సాయి ధరమ్ తేజ్.. తిరుమలను సందర్శించారు. పవన్ గెలిస్తే కాలినడకన తిరుమలకు వస్తానంటూ మొక్కిన మొక్కులను చెల్లించుకున్నారు. ఆయనతో ఫొటోలు దిగడానికి అలిపిరి మెట్ల మార్గంలో భక్తులు పోటీ పడ్డారు.












Click it and Unblock the Notifications