ఏడిపించేశారుగా.. ఆ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!
ప్రముఖ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన 'మై వాపస్ ఆవుంగా' సినిమా చూసి స్టార్ హీరోయిన్ కృతి కర్బందా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా తనను ఎంతగానో కదలించిందని పేర్కొంటూ ఆమె సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ను షేర్ చేశారు. ఈ సినిమా తన కంటికి రెప్పలా చూసుకున్న దివంగత తాతయ్యలను గుర్తు చేసిందని.. వారి త్యాగాలను స్మరించుకునేలా చేసిందని ఆమె రాసుకొచ్చారు. మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేసి, తమ సర్వస్వాన్ని వెనుక వదలేసి కష్టపడటం వల్లే ఈ రోజు మనం ఇంత మంచి స్థాయిలో ఉన్నామని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఇంతియాజ్ అలీ మేకింగ్ శైలిని కృతి కర్బందా ఆకాశానికెత్తారు. "సాధారణంగా మీ సినిమాలు చూస్తే సొంత ఇంటికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. కానీ ఈ సారి మాత్రం నాకు ఇల్లు దొరకలేదు.. ఆ ఇంటి జ్ఞాపకాలు లభించాయి" అంటూ ఆమె భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా చూసిన అనంతరం ఇల్లు అనే పదానికి తనకున్న అర్థం పూర్తిగా మారిపోయిందని.. మనం నివసించే స్థలమే కాకుండా మనం తిరిగి వెళ్లలేని కొన్ని జ్ఞాపకాలు కూడా ఒక ఇల్లే అవుతాయని కృతి కర్బందా పేర్కొన్నారు.

స్క్రీన్ పై కథ ముగిసినా, కొన్ని సినిమాలు ప్రేక్షకుల హృదయాలలో చాలా కాలం పాటు నిలిచిపోతాయని.. 'మై వాపస్ ఆవుంగా' అటువంటి సినిమానేనని కృతి కర్బందా ప్రశంసలు కురిపించారు. సమాజంలోని ఓ సామాన్య మానవుడిని హీరోగా చూపించినందుకు చిత్ర బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన తాతయ్యల వంటి ఎంతో మంది అనామక హీరోలకు ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిన కృతి కర్బందా పోస్ట్ను చూస్తుంటే, ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను ఎంతగా తాకిందో స్పష్టమవుతోంది.
కృతి కర్బందా తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితమే. ఆమె హిందీతో పాటు కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించారు. తెలుగులో 'బోణి', 'తీన్మార్, 'మిస్టర్ నూకయ్య', 'బ్రూస్ లీ' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ ప్రాజెక్ట్లతో పాటు నెట్ఫ్లిక్స్ క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ 'రానా నాయుడు సీజన్ 2' లోనూ, అలాగే రానా దగ్గుబాటి సరసన పేరు పెట్టని ఓ సరికొత్త చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications