చిరంజీవి మిస్ చేసుకున్న బ్లాక్బస్టర్లు
మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. అందులో మూడు దశాబ్దాలు అగ్ర కథానాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. సుప్రీంహీరో చిరంజీవి నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారారు. ఈ క్రమంలో అనేక సూపర్ హిట్ సినిమాలను, ఇండస్ట్రీ హిట్ సినిమాలను ప్రేక్షకులకు, పరిశ్రమకు అందించి తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లి, తిరిగి వెనక్కి వచ్చి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత మాత్రం కాస్త వెనకబడ్డార. సినిమాల విజయాల శాతం చాలా తక్కువగా ఉంది. కేవలం ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు మాత్రమే విజయాలు సాధించాయి.
కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతో...
తన కెరీర్ లో చిరంజీవి కాల్షీట్లు ఖాళీ లేక, కొన్ని కథలు నచ్చక, మరికొన్ని ఇతర కారణాలతో తన దగ్గరకు వచ్చిన కొన్ని సినిమాలను తిరస్కరించారు. అవన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి. అలా చిరు దగ్గరకు వచ్చిన సినిమాల్లో ఆఖరి పోరాటం సినిమా ఉంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించారు. నాగార్జున-శ్రీదేవి జంటగా నటించారు. యండమూరి నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా చిరంజీవితో తీద్దామనుకున్నారు.

డేట్లు ఖాళీ లేకపోవడంతో నాగార్జునతో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన మన్నెంలో మొనగాడు సినిమా కూడా చిరు చేయాల్సింది. అది కూడా డేట్లు ఖాళీ లేక వదులుకోవడంతో సూపర్ హిట్ గా నిలిచింది. పాటలన్నీ మ్యూజికల్ హిట్ అయ్యాయి. రజనీకాంత్ కెరీర్ లో ఇండస్ట్రీహిట్ గా నిలిచిన చంద్రముఖిని చిరంజీవితో తెరకెక్కిద్దామని నిర్మాతలు ఎంతో ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో రజనీకాంత్ చేశారు. అది ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే.
ఆ హీరో కెరీర్ ను మలుపు తిప్పింది
మోహన్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన అసెంబ్లీ రౌడీ కూడా చిరు చేయాల్సి ఉంది. అయితే రాజకీయ నేపథ్యం ఉందని వద్దనుకున్నారు. అలాగే వెంకటేష్-శిల్పాశెట్టి నటించి సాహసవీరుడు సాగరకన్య సినిమా కూడా చిరుతో చేద్దామని రాఘవేంద్రరావు భావించారు. అలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయని, వద్దనడంతో వెంకీతో చేసి రాఘవేంద్రరావు హిట్ కొట్టారు. ఇటీవలే రవితేజ చేసిన టైగర్ నాగేశ్వరరావు కథ ముందుగా చిరు దగ్గరకు రాగా కథ నచ్చక వద్దన్నారు. రవితేజ చేయగా అది దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది.












Click it and Unblock the Notifications