శుక్రవారం రిలీజ్ అయింది.. ఆదివారం తీసేశారు.. ఏంటీ సినిమా వివాదం
చాలా సినిమాలు ఎంటర్ టైన్ మెంట్, బాక్సాఫీస్ వసూల్లే లక్ష్యంగా తీస్తుంటారు. కానీ యథార్థ సంఘటనల ఆధారంగా నిర్మించే సినిమాలు చాలా తక్కువే. ఎట్టకేలకు అవి థియేటర్లలోకి వచ్చినా కలెక్షన్స్ సరిగా ఉండవు. ఈ క్రమంలో ఓ సినిమా మూడేళ్లుగా సెన్సార్ బోర్డు చుట్టూ తిరుగుతూ అనేక వివాదాల్లో చిక్కుకున్న 'పంజాబ్ 95' అనే సినిమా ఇప్పుడు సట్లజ్ అనే పేరుతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 3 శుక్రవారం నుంచి జీ5 లో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రాన్ని హనీ ట్రెహాన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించారు. పంజాబ్ చరిత్రలో అత్యంత చీకటి రోజులుగా భావించే 1984 నుంచి 1994 మధ్య కాలంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇక పంజాబ్ లో 1984 నుంచి 1994 మధ్య ఉగ్రవాదం తీవ్రంగా ఉండేది. ఆ సమయంలో పోలీసులు అనేకమంది మృతదేహాలను చట్టవిరుద్ధంగా దహనం చేశారు. అదే సమయంలో వేలాది మంది అదృశ్యం అయినట్లు కేసులు నమోదయ్యాయి.
ఈ అక్రమాలపై జస్వంత్ సింగ్ ఖల్రా అనేక విధాలుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే ఆయన 1995 లో ఒక్కసారిగా అదృశ్యం అయ్యారు. పోలీసులే అతడ్ని కిడ్నాప్ చేసి హతమార్చాలనే అనుమానాల మధ్య సుదీర్ఘకాలం పాటు విచారణ జరిగింది. ఈ క్రమంలో 2005 లో నలుగురు పంజాబ్ పోలీసు అధికారులకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత 2007 లో పంజాబ్, హరియాణా హైకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది.

ఈ మూవీకి సెన్సార్ బోర్డు సభ్యులు ఏకంగా 127 కట్స్ చెప్పారు. దాంతో మూడేళ్లపాటు పోరాటం చేసినా ఫలితం లేకపోవడంతో ఈ మూవీని సెన్సార్ బోర్డుకు తగిన విధంగా సీన్స్ తొలగించి ఇటీవల ఓటీటీ వేదికగా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీని తాజాగా ఓటీటీ సంస్థ తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఇలా అర్ధాంతరంగా సట్లజ్ సినిమాను ఆ ప్లాట్ ఫామ్ నుంచి తీసివేయడం వల్ల అటు సినిమా వాళ్లకు ఇటు ఓటీటీ సంస్థకు కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ మూవీలో బాలీవుడ్, పంజాబీ నటుడు దిల్ జీత్ దొసాంజ్ కీలక పాత్రలో నటించారు. ఆయనతోపాటు అర్జున్ రాంపాల్, కన్వల్ జీత్ సింగ్, సువిందర్ విక్కీ కీలక పాత్రల్లో నటించారు.












Click it and Unblock the Notifications