లోకేష్ కోసం టీడీపీని నాశనం చేస్తున్నారు
Vyooham trailer: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని చిత్రీకరించిన సినిమా ఇది. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. ఎన్నో న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొని, ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటించాడు. వైఎస్ భారతి క్యారెక్టర్ను మానస రాధాకృష్ణన్ పోషించారు. ఈ సినిమా షూటింగ్.. దాదాపుగా విజయవాడ, గుంటూరు పరిసరాల్లో సాగింది.

రెండు భాగాలుగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంది. ఫస్ట్ పార్ట్ ఈ నెల 23వ తేదీన విడుదల కానుంది. శపథం పేరుతో తెరకెక్కిన రెండో భాగం.. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే వైఎస్ జగన్ పాదయాత్రను కథాంశంగా తీసుకుని నిర్మించిన యాత్ర 2 మూవీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు వ్యూహం, శపథం ఎలా ఉండబోతోన్నాయనేది ఆసక్తి రేపుతోంది.
నిజానికి- గత ఏడాది డిసెంబర్లో వ్యూహం రిలీజ్ కావాల్సి ఉండగా.. దీన్ని అడ్డుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. కోర్టుకెక్కారు. సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ సెన్సార్ బోర్డుకూ లేఖ రాశారు. దీనితో ఈ సినిమా విడుదలలో జాప్యం చోటు చేసుకుంది. తీరా ఎన్నికల వేడి రాజుకున్న దశలో విడుదల కాబోతోంది.
వైఎస్ జగన్, ఆయన భార్య వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్.. ఇలా అన్ని ప్రధాన పాత్రలూ ఈ సినిమాలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్ కూడా ఇందులో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజాగా- ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వ్యూహం, శపథం మిక్స్ చేసి ఈ ట్రైలర్ను వదిలారు. తనదైన మార్క్ చూపించారు. పదునైన డైలాగ్స్ ఉన్నాయి ఇందులో. ఓ మంచి కాంటెంపరరీ పొలిటికల్ థ్రిల్లర్గా ఈ సినిమాను చిత్రీకరించారనే అభిప్రాయాన్ని కలిగించింది.
చంద్రబాబు జైలుకు వెళ్లడం, తెలుగుదేశం పార్టీ- జనసేన పొత్తు అంశాన్నీ ఈ ట్రైలర్లో ప్రస్తావించారు. లోకేషే ఈ పార్టీని నడపాలన్న పట్టుదలతో మీరు ఈ పార్టీని నాశనం చేస్తున్నారనే డైలాగ్ ట్రైలర్ ప్రారంభంలోనే వినిపిస్తుంది. ఆ జగన్ను కిందికి లాగడానికి మనకు అతను కావాలి.. అనే డైలాంగ్ ఈ రెండు పార్టీల పొత్తుకు అద్దం పడుతుంది.
గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేష్.. రాజమండ్రి ఘాట్ వద్ద పుణ్య స్నానాలను ఆచరిస్తోన్న సమయంలో సంభవించిన తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం పాలైన విషయాన్ని గుర్తు చేశారు రామ్ గోపాల్ వర్మ. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనను టీడీపీ ఎలా అడ్డుకుందనేదీ ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications