Fact check : ఆ ఫోటోలో నిజమెంత... మహిళపై పోలీసుల దౌర్జన్యం,బలవంతంగా అరెస్ట్?
రైతు ఉద్యమానికి ముడిపెట్టిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ మహిళను ఆరుగురు మహిళా పోలీసులు బలవంతంగా లాక్కెళ్తున్నట్లు అందులో కనిపిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకే ఆ మహిళను దౌర్జన్యంగా లాక్కెళ్లారని సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.
జూన్ 26న చంఢీగఢ్లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ మహిళను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదు. Oneindia టీమ్ రివర్స్ సెర్చ్ ద్వారా ఈ విషయాన్ని నిర్దారించింది. నిజానికి ఆ ఫోటో 2015లో పంజాబ్లోని పటియాలాలో జరిగిన నిరసనల సందర్భంలోనిది. అప్పట్లో హిందుస్తాన్ టైమ్స్ దీనిపై కథనం కూడా ప్రచురించింది. గ్రామ పంచాయతీల పరిధిలోని భూములను తమ ఆధీనంలోకి తీసుకోవాలని జిల్లా పాలనా విభాగం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో అక్కడి రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

పోలీసులు వారిపై లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో 12 మందిని అరెస్ట్ చేయగా... ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న మహిళ కూడా అందులో ఒకరు. ప్రస్తుతం రైతులు చేస్తున్న ఆందోళనలకు అప్పటి పటియాలా రైతులు చేసిన ఆందోళనలకు ఎటువంటి సంబంధం లేదు. అప్పటి ఫోటోనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇలాంటి పోస్టుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.

Fact Check
వాదన
రైతు నిరసనల్లో పాల్గొంటున్న మహిళను దౌర్జన్యంగా,అమానవీయంగా చండీగఢ్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం.
వాస్తవం
ఆ ఫోటో 2015కి చెందినది. అప్పట్లో పటియాలాలో రైతుల నిరసన సందర్భంగా తీసిన ఫోటో.












Click it and Unblock the Notifications