మళ్లీ రిజర్వేషన్ల చిచ్చు!
నేపథ్యగాయకుడు ఉదిత్ నారాయణ్ వివాదంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ మధ్య ఉదిత్ నారాయణ్, ఒక స్త్రీతో బస చేసిన హోటల్కు మరో స్త్రీ వచ్చి తాను ఉదిత్ నారాయణ్ భార్యనంటూ గొడవ చేయడంతో వివాదం రచ్చకెక్కింది. రంజనా నారాయణ్ అనే స్త్రీ హోటల్ గది వద్దకు వచ్చి ఉదిత్ నారాయణన్ రచ్చకీడ్చింది. ఉదిత్ నారాయణ్ రెండో వివాహంపై నేపాల్ పత్రిక ఒకటి ప్రముఖంగా ప్రచురించడంతో మొదలైన వివాదం ఆయన మొదటి భార్య గొడవతో పూర్తిగా రచ్చకెక్కింది. రంజన ఎవరో తనకు తెలియదని ఉదిత్ బుకాయించే ప్రయత్నం చేశారు.
రంజనా నారయణ్ ఉదిత్ భార్య అని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. దీంతో ఉదిత్ పూర్తిగా ఇబ్బందులో చిక్కుకున్నట్లే. తన వద్ద ఉన్న ఆధారాలతో రంజనా నారయణ్ జాతీయ మహిళా కమీషన్కు ఫిర్యాదు చేసింది. తన వద్ద పత్రాలను, ఛాయాచిత్రాలను రంజన కమీషన్కు సమర్పించింది. దీంతో ఆమె ఎవరో తెలియదన్న ఉదిత్ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.
ఉదిత్ రంజనలకు కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఉంది. దాన్ని ఇప్పటికీ నిర్వహిస్తూ వున్నారు. నేపాల్లోని భార్దా సమీపంలోని గ్రామంలో ఉదిత్ నారాయణ్కు, రంజనకు కలిసి స్థిరాస్తులున్నాయి. అది ఉదిత్కు వారసత్వంగా సక్రమించిన భూమి కావడం విశేషం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీర్పూర్ శాఖలో ఉదిత్, రంజనల జాయింట్ సేవింగ్స్ ఖాతాను ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ పాస్ బుక్లో ఉదిత్ నారాయణ్ పేరు ఉంది. ఉదిత్ నారాయణ్, ఆర్టిస్టు, గ్రామం/ పోస్టు: భార్దా, జిల్లా సప్తారి (నేపాల్) అనే చిరునామా ఉంది. అంతేకాకుండా 1990 జులై 20వ తేదీన తన ముంబాయి బ్యాంక్ ఖాతా నుంచి ఆ జాయింట్ ఖాతాకు ఉదిత్ వేయి రూపాయలు బదిలీ చేశారు.
ఉదిత్, రంజనలకు కలిసి బార్దాలో 25 కత్తాల భూమి ఉంది. నిజానికి తమకు 30 కత్తాల భూమి ఉండేదని, 11 కత్తాల భూమిని తన సోదరుడి భార్య గంగాదేవి పేరు మీద రిజిష్టర్ చేయాలని తనపై ఉదిత్ ఒత్తిడి తెచ్చాడని, అయితే ఉదిత్ మరో సోదరుడి సలహాతో తాను ఐదు ఎకరాలు మాత్రమే బదిలీ చేశానని రంజన ఒక ఆంగ్ల దినపత్రిక ప్రతినిధితో చెప్పింది. ఈ భూమి రిజిస్ట్రేషన్ తర్వాతనే ఒక నేపాల్ పత్రిక ఉదిత్ రెండో వివాహం గురించి కథనాన్ని ప్రచురించింది. అప్పటి నుంచి ఉదిత్ సోదరులు భూమి బదిలీ చేయాలని తనను వేధిస్తూనే ఉన్నారని రంజన చెబుతోంది. ఖయామత్ సే ఖయామత్ సినిమా విడుదల తర్వాత బిర్పూర్ ఉదిత్ తన పేరు మీద ఒక కత్తా భూమి కొన్నాడని కూడా ఆమె అంటోంది. ఉదిత్ నారాయణ్ సోదరుడు సంజయ్ నారాయణ్ భూమి పక్కనే ఉదిత్ మరో రెండు కత్తాల భూమి కొనుగోలు చేశాడని కూడా ఆమె చెప్పింది. సంజయ్ నారాయణ్ భార్య మంజు రంజన సోదరి కావడం విశేషం.