చంద్రబాబు కన్నా చిరంజీవి నయం
పార్టీపరంగా కమిటీ వేసి, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పొత్తు పెట్టుకున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని చెప్పించారు. ఇదంతా జరిగిన తర్వాత కేవలం రాత్రికి రాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారని చంద్రబాబు మెలిక పెట్టారు. అంత చర్చ జరిగి, నిర్దిష్టమైన వైఖరి తీసుకున్న తర్వాత అర్థరాత్రి ప్రకటిస్తే ఏమిటి, పగటి పూట ప్రకటిస్తే ఏమిటని ప్రశ్నించేవారు లేరు. ఆ తర్వాత సీమాంధ్ర ప్రజల అభిప్రాయాల మేరకు స్పందించడానికి ఆ ప్రాంత నాయకులకు స్వేచ్ఛనిచ్చానని అంటున్నారు. తెలంగాణపై అధ్యయనానికి వేసిన కమిటీలో ఎర్రంనాయుడు వంటి సీమాంధ్ర నాయకులు కూడా ఉన్నారు. వారే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించారు. అంటే, వారు సీమాంధ్ర ప్రజల మనోగతాన్ని అధ్యయనం చేయకుండానే తెలంగాణకు అనుకూలంగా సిఫార్సు చేశారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
సరే, ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని పార్టీపరంగా సమీక్షించి, వెనక్కి తీసుకున్నారా అంటే, అదీ లేదు. అటువంటప్పుడు పార్టీ తెలంగాణ అనుకూల వైఖరే చెలామణిలో ఉండాలి. ఈ పార్టీ తెలంగాణ అనుకూల వైఖరికి వ్యతిరేకంగా పనిచేసిన సీమాంధ్ర నేతలు క్రమశిక్షణను ఉల్లంఘించారని చెప్పాల్సి వస్తుంది. వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, చంద్రబాబు అందుకు విరుద్ధమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. తెలంగాణ అనుకూల వైఖరిని వెనక్కి తీసుకోకుండా పార్టీ వైఖరిని మాట్లాడుతున్న నాయకులపై చర్యలకు దిగుతున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు కన్నా చిరంజీవి ఒక విధంగా మెరుగు అని చెప్పాల్సి వస్తోంది.