మరవలేము నిన్ను రాజశేఖరా!

YS Rajasekhar Reddy
సెప్టెంబర్ 2, 2009. ఆంధ్ర రాష్ట్ర చరిత్రని సమూలంగా మార్చిన రోజు! 2004 నుండి అప్పటివరకు నల్లేరు మీద నడక లాగా సాగుతున్న ఒక రాష్ట్ర ప్రయాణం ఒక్క సారిగా దివిసీమలో 1977లో వచ్చిన తుఫానులో లాగా చెల్లా చెదురై, కుదేలయింది! ఏమి జరుగుతుందో, ఎవరేమి చేస్తున్నారో తెలుసుకునే లొగా 2013 వచ్చింది! కలలో కూదా ఊహించలేనంత అత్యంత నీఛ స్థాయికి రాజకీయాలు దిగజారాయి! ఇప్పుడున్న రకపు కుట్రలు, కుమ్మక్కులు చరిత్రని మార్చిన ఆ రోజుకు ముందు ఊహించలేము. దేశం, సమాజం, విలువలు ఎమైపోయినా పర్వాలేదు కాని మాకు అధికారం కావాలి అనే విధానం నూతనంగా ప్రతిస్ఠించబడినది! న్యాయ వ్యవస్థని, అసెంబ్లీ స్పీకర్ అధికారాలని, గవర్నర్ రాష్ట్రపతి హోదాలని కించపరుచుకుటూ సాగుతున్న ఈ దమన కాండ నిర్విఘ్నంగా సాగుతున్నది. అధికారం కోసం ఎన్ని తప్పుడు పనులైనా చేయొచ్చు అని నిస్సిగ్గుగా, గర్వంగా ప్రకటిస్తున్నారు! 1975 ఎమర్జెన్సీని మించి ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక ప్రజానాయకుడిని తమ అడ్డు తొలగించుకోవడానికి అధికార ప్రతిపక్షాలు రాజకీయ వ్యభిచారం చేయడానికి వెనకడుగు వెయ్యడం లేదు! ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను, న్యాయవ్యవస్థను అత్యంత నీఛ స్థాయికి దిగజార్చడానికి ఒక్క క్షణం కూడా అలోచించడం లేదు. ముందు తరాలకి ఇంత అన్యాయం చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, యెల్లో మీడియాలని ఏ పరిస్థితులు పురిగొల్పేయి?

సెప్టెంబర్ 2, 2009 దాకా రాజ్యాంగబద్దంగా జరుగుతున్న పరిపాలన ఒక్క సారిగా అసంబద్దంగా అయిపోయింది. ఇలా ఎందుకయింది? ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసం తలపెట్టిన ప్రజాసంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతున్నవని తరచి చూడటానికి రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ మార్గ మధ్యాన అనుమాన పరిస్థితుల్లో అసువులు బాస్తే, కాంగ్రెస్ పార్టీలో ఆయన స్తానాన్ని భర్తీ చెయ్యడానికి సరైన నాయకుడు కనబడక 150 పైగా ఎమ్మెల్లేలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేశారు. దీన్ని సోనియా గాంధీ, కాంగ్రెస్ పెద్దలు ధిక్కారంగా భావించారు. వెంటనే రోశయ్యను (సీయెల్పీ నాయకుడిగా ఎన్నిక కాకుండానే) ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణం చేయించారు. ఇక్కడొక గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు కూడా రాష్ట్రపతి జైల్ సింగ్ రాజీవ్ గాంధీ "కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ తమ నాయకుడిగా ఎన్నికయ్యారు" అని లేఖ ఇచ్చే వరకు ఆయనతో ప్రమాణం చెయ్యనివ్వలేదు. రోశయ్య అక్రమ ప్రమాణంపై ఒక న్యాయవాది హైకోర్టులో కేసు వేస్తే, కోర్టు విషయాన్ని మూడు నెలలు సాగింది. చివరికి రోశయ్య సీయెల్పీ నాయకుడిగా ఎన్నిక అయిన తర్వాత కేసుని కొట్టివేసింది.

డాక్టర్ వైస్సార్ జీవితం, మరణం నిజంగా మరపురాని ఘట్టాలు. అధికారంలో ఉన్నా, లేకపోయినా అయన జనహితాన్ని కాంక్షించారు, ప్రజాభ్యున్నతికి నిరంతరం పరితపించారు. కోట్లమంది ప్రజల ఆదరాభిమానాలని అలవోకగా కూడగట్టుకున్న, అదే విధంగా తిరిగి పదింతలు ఎదురిచ్చిన మహామనిషి. ప్రజాసేవలో తరించిన వైఎస్సార్ ధన్యజీవి. అమరజీవి! ఆయన చావులో కూడా ఆ దేవుడు మనందరికీ ఆయన చెరిగిపోయిన నవ్వుని చూపించకుండా ఆ నవ్వే మారాజునే మిగిల్చాడు. పంచభూతాల సాక్షిగా శ్రీశైల మల్లన్న సన్నిధిలో దివికేగిన ఆయన మరణం కూడా అజరామరం. ప్రమాదం జరిగిన తర్వాత 24 గంటల వరకు ఆయన ఆచూకి తెలియక ప్రజలు బడ్డ అవేదన వర్ణనాతీతం, టీవీలకి అతుక్కుపోయారు. ఇదే సమయంలో టీఆర్పీ రేటింగ్స్ కోసం టీవీ చానెల్స్ అన్నీ వైస్సార్ మీద ప్రసారం చేసిన కథనాలు ప్రజల గుండెలని కదిలించాయి. అత్యంత బాధాతుప్త, బలహీనంగా ఉన్న కొన్ని గుండెలు ఆగిపోయాయి, వారి కుటుంబాలు బజారున పడ్డాయి. విగతజీవులైన వారే కాకుండా కోట్ల మంది ప్రజలు తమ ఆప్తుడ్ని లిప్తపాటులో, అనుకోకుండా కోల్పోవడంతో మనసులు తీవ్రంగా బాధపడ్డాయి. ఇది అర్ధం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి నల్లకాలువలో తన తండ్రి మరణంతో ఆగిపోయిన, బాధపడిన ప్రతి గుండెను ఓదారుస్తానని మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకోనివ్వకుండా చేసి వైఎస్సర్ కుటుంబానికున్న విశ్వసనీయతను దెబ్బతీయడానికి కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ప్రయత్నం చేశారు.

ఇది గమనించిన జగన్మోహన్ రెడ్డి తన మాట నిలబెట్టుకోవాలంటే తన మార్గం కాంగ్రెస్తో వేరవ్వాలనే నిర్ణయానికొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీజాలు పడ్డాయి. కాని 2011 నవంబర్ వరకు తొందరపడకుండా ఓదార్పు యాత్ర చేసి రాష్ట్రంలోని చాలా ప్రాంతాలని చుట్టి వచ్చారు. యాత్రకి వచ్చిన అద్భుత స్పందనని చూసిన కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు అది పాల పొంగని విశ్లేషణ చేశారు. కాని ప్రజల నాడిని కనుక్కోవడంలో తండ్రిని మించినవాడిగా, ప్రజా నాయకుడిగా జగన్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు! ఏ జిల్లాకి పోయినా ఉప్పెనలా వచ్చే ప్రజా స్పందన రాజకీయ విశ్లేషకులని అబ్బుర పరిచింది. వైస్సార్ మీదున్న ప్రేమానురాగాలు, జగన్ మీద ప్రజలు పెంచుకున్న వాత్సల్యం, నమ్మకం, అభిమానం, డిల్లీ కాంగ్రెస్ శక్తులతో, తెలుగుదేశం పార్టీ/యెల్లో మీడియాతో జగన్ చేస్తున్న పోరాటాన్ని ప్రజలు తమ పోరాటంగా భావించి తమ సంపూర్న మద్దతు అందించారు. కడప పార్లమెంటు ఎన్నికలో ఐదున్నర లక్షల రికార్డు మెజారిటీ, పులివెందుల అసెంబ్లీ ఎన్నికలో లక్ష రికార్డు మెజారిటీలు ఒక ఎత్తయితే నెల్లూరులో పార్లమెంటు ఎన్నికలో వచ్చిన మెజారిటీ కనీ వినీ ఎరుగనిది. ఈ నెల్లూరు ఫలితం తర్వాతే కాంగ్రెస్, తెలుగుదేశం మంద బుద్దులకి అర్ధమయింది - జగన్ అనేది వ్యక్తికాదు అతనో శక్తి అని, ఒక సునామీ అని! 18 అసెంబ్లీ స్తానాలకి, నెల్లూరు పార్లమెంటుకి జరగబోతున్న ఉప ఎన్నికలకి ముందు, ఎన్నికల్లో ప్రచారం చెయ్యకుండా చేస్తే జగన్ని ఓడించవచ్చు అనే ఎవరో తెలివిలేని వాళ్ళ సిద్ధాంతంతో ఆయన్ని మే 24, 2012లో "సాక్ష్యాలని తారుమారు చేస్తాడు" అనే కుంటిసాకుతో అక్రమంగా అరెస్ట్ చేశారు.

కాని, విచిత్రంగా ఫలితాల్లో ఇనుమంతైనా తేడా రాలేదు! రావడం లేదు!! కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మద్దతుతో (కుమ్మక్కుతో అని కూడా అనొచ్చు!) నర్సాపురం (టీడీపికి 8 వేల ఓట్లు), రామచంద్రపురం (టీడీపికి 5 వేల ఓట్లు) గెలుపొందింది. అదే తెలుగుదేశమైతే 2009 నుండి జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలవకపోగా సగం స్తానాల్లో డిపాజిట్లు కోల్పోయి, దుకాణాన్ని మూసుకునే దిశగా ముందుకి పోతున్నది. తెలుగుదేశంలోని నాయకులకి వారి అధినేత చంద్రబాబుపై విశ్వాసం పూర్తిగా సడలిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాని, తెరాసలో గాని చేరడానికి అర్రులు చాస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో కూదా పెడ్డ తేడా లేదు. ఎలాగు వైఎస్సార్ రెక్కల కష్టం మీదొచ్చిన ఈ ప్రభుత్వం ఇంకో సంవత్సరం ఉంటుంది కాబట్టి అప్పటిదాకా సోనియా, రాహుల్ భజన చేసుకుంటూ, వారి మెప్పు కోసం దివంగత మహానేత వైఎస్సార్ని అడ్డంగా విమర్శించుకుంటూ ప్రజల ఏహ్యానికి గురై జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారు!

వైఎస్సార్ మరణం, జగన్ కాంగ్రెస్ పార్టీ వీడి బలపడటంతో కాంగ్రెస్ అధినాయకత్వానికి చేష్టలుడిగి ఒకే ఒక్క ప్రజా నాయకుడిని ఎదుర్కోవడానికి సీబీఇ లాంటి వ్యవస్తలని దుర్వినియోగం చెయ్యడమే కాకుండా తెలంగాణా లాంటి తేనెతుట్టెలని కదపడానికి కూడా వెనుకాడలేదు! ఫలితం కెసీఆర్ సెలైన్ మీద ఆమరణ నిరాహార దీక్ష, రాష్ట్రం అల్లకల్లోలం అయ్యి 2009 డిసెంబర్ 9న వెలువడిన చిదంబర ప్రకటన. తెలంగాణ ప్రజల సెంటిమెంటుని గౌరవించాల్సిన ఆవశ్యకత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. అయితే, రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సిద్ధపడటం కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యం! రాష్ట్ర ప్రజలు మొత్తం రెండుగా విడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ అనైతిక విధానంతోనే సాధ్యమయింది. మన రాష్ట్రానికి చెందిన పెద్దమనుషులు కలిసి కూర్చుని నిర్ణయించాల్సిన అత్యంత ఆవశ్యకరమైన విషయాన్ని ఒక తమిల్ తంబి ఇంకో ఇటాలియన్ మహిళ చేతిలో పెడుతున్న దుర్బర పరిస్తితిల్లో ఉన్నది రాష్ట్ర నాయకత్వం.

ఇక చంద్రబాబు, తెలుగుదేశం విషయానికొస్తే తమ సొంత వర్గం గుప్పిట్లో ఉన్న మీడియాని ఉపయోగించుకుంటూ బమ్మిని తిమ్మి తిమ్మిని బమ్మి చేయాలని చూస్తున్నారు, చూస్తూనే ఉంటారు. కాని, రాష్ట్ర ప్రజలు ఈ టక్కరి ప్రచార పరిధిని దాటిపోయారు. అందుకే చంద్రబాబు రైతులకోసమని ఆమరణ నిరాహార దీక్ష, వస్తున్నా మీకోసమంటూ రికార్డ్ పాదయాత్ర చేసిన వీసమెత్తుకూడా తేడా రాలేదు. ఎక్కడ ఎన్నికలు జరిగినా డిపాజిట్ల గురించి అలోచించాల్సిన పరిస్తితే! మధ్య మధ్యలో యెల్లో మీడియా ఆధ్వర్యంలో ఆ సర్వే ఈ సర్వే అని వండి వార్చడం రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టడానికే అని అసెంబ్లీ స్పీకరుతో లాలూచి పడి ఉప ఎన్నికలు రాకుండా చెయ్యడంలోనే అర్ధమైంది. షర్మిలమ్మ చేస్తున్న పాదయాత్రకి రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న స్పందన జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్రని మరిపిస్తున్న విధానం చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనడానికి నిదర్శనం. ఎప్పుడెన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఉవ్విలూరుతున్నారన్నది జగమెరిగిన సత్యం!

ఒక మనిషి మరణం ఒక రాష్ట్ర స్తితిగతులని, ద్రుక్పదాన్ని, వైఖరిని, గమ్యాన్ని, గతిని మార్చడం ఒక్క వైఎస్ రాజశెఖర రెడ్డితోనే చూశామంటే అతిశయోక్తి కానే కాదు! నీవు నడచిన నేలలోనే నడిచాము, నీవు పీల్చిన గాలినే పీల్చాము, నీవు బతికిన కాలంలోనే బతికాము అని ప్రజలు గర్వపడే మహోన్నతమైన మనీషివి నీవు రాజశేఖరా! నీ మహోన్నత నాయకత్వం లేక కునారిల్లుతున్నది మన రాష్ట్రం! మరవలేము నిన్ను రాజశేఖరా ఎన్నటికీ!!

(రాజశేఖర రెడ్డి గారి 64వ జయంతి సందర్భంగా)

- గురవారెడ్డి (అట్లాంటా)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+