వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠకులకు చిన్నవిన్నపం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పనికి ఆహార పథకం అమలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తలనొప్పిగా మారింది. ఈ పథకం సక్రమంగా అమలు కావడం లేదని, తెలుగుదేశం కార్యకర్తల జేబులు నింపేందుకే ఉపయోగపడుతోందని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. కాంగ్రెస్‌ బురద చల్లుతోందని అధికార తెలుగుదేశం పార్టీ మొత్తుకుంటోంది. అయితే, ప్రభుత్వ వాదనలు గానీ, అధికార పార్టీ ప్రతి విమర్శలు గానీ పథకం అమలులోని అక్రమాలను, అవినీతిని కప్పిపుచ్చలేకపోతున్నాయి.

గ్రామాల్లో ఉపాధి కోసం నిర్దేశించిన పనికి ఆహార పథకం కింది బియ్యం బ్లాక్‌ మార్కెటింగ్‌కు తరలిపోతున్న వైనాలు బయటపడుతూనే ఉన్నాయి. స్వయంగా ఈ వ్యవహారంలో మంత్రుల పాత్రపై వచ్చిన, వస్తున్న ఆరోపణలు తెలుగుదేశం ప్రభుత్వానికి తలబొప్పి కట్టిస్తున్నాయనడంలో సందేహం లేదు. పాలకొల్లులో పనికి ఆహార పథకం కింది బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంలో విద్యుచ్ఛక్తి మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పాలకొల్లులో కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో ఈ విషయమై ధర్నా కూడా చేశారు. కొత్తపల్లి సుబ్బారాయుడిని మంత్రి వర్గం నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అలాగే, తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి కె.ఇ. ప్రభాకర్‌ కూడా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. కర్నూలు జిల్లాలోని ద్రోణాచలం మండలంలో పనికి ఆహార పథకం కింద చేపట్టిన 25 పనుల్లో 20 పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు విచారణ సంఘం నిర్ధారించింది. ఈ పథకాన్ని సుదీర్ఘ కాలం అమలు చేయడం వల్ల ఈ ఆరోపణలు వస్తున్నాయనే అభిప్రాయం కొందరు సీనియర్‌ మంత్రుల నుంచి వ్యక్తమవుతోంది. ఏ సంక్షేమ పథకమైనా దీర్ఘ కాలం అమలయితే ఆరోపణలు వస్తాయనేది వీరి నమ్మకం.

అయితే, వాస్తవాలు ఎప్పుడైనా కింది స్థాయిలోనే అర్థమవుతాయి. కింది స్థాయిలో దీని అమలు తీరును పరిశీలిస్తే, గ్రామాల్లోని ప్రజలు చెప్పే విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ పథకం అమలులోని అవకతవకలు ఇట్లే అర్థమవుతాయి. ఉద్దేశించిన లక్ష్యానికి భిన్నమైన పద్ధతి ఆచరణలో ఉన్నదనేది గ్రామాల్లో ఎవరినడిగినా చెప్తారు. గ్రామాల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు వాటాలు వేసుకుని లబ్ధి పొందున్నారన్న విషయం కింది స్థాయిలో కొత్త విషయమేమీ కాదు. జన్మభూమి పనులలో జరుగుతున్న వ్యవహారమే పనికి ఆహార పథకం విషయంలో జరుగుతోంది. పనులు మాత్రం చేపడుతున్నారు. అయితే, ఆ పనులు ఉపాధి కల్పించడం అనేది కొన్ని చోట్ల జరగడం లేదు. పైగా, పని చేస్తున్నవారికి తగిన రూపంలో ఫలసాయం అందడం లేదు. కొందరి జేబులు మాత్రం నిండుతున్నాయనేది కాదనలేని సత్యం.

ఈ పథకం వల్ల ఎవరికి మేలు జరిగినా, జరగకపోయినా తెలుగుదేశం పార్టీకి మాత్రం మేలు జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం ఏదో విధంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికే పనికి వస్తుంది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న ఒక బలమైన వర్గం ఏర్పడి, అది తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ ఉంటుంది. ఇదే పని పనికి ఆహార పథకం విషయంలో జరుగుతోంది. ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో అక్కడ నిలబడి ప్రతిపక్షాలు వాటిని నిలువరిస్తే తప్ప వాటికి తగిన బలం చేకూరదు. రాజధాని నగరంలో, ముఖ్య పట్టణాల్లో కూర్చొని ప్రభుత్వాన్ని ఎంత దుమ్మెత్తి పోసినా చంద్రబాబు పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదు. ఈ విషయం బహుశా, చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన అవకతవకలను, అక్రమాలను నిరోధించడానికి చర్యలు చేపట్టినట్లు హంగామా చేస్తారు. ఈ హంగామాతో సమస్య పరిష్కారం విమర్శలు, ఆరోపణలు గాలికి పోతాయి. జరగాల్సిన పని జరిగిపోతూ ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X