క్రికెటర్లకు ఇళ్ల స్థలాలు?
పేదలకు ఇళ్లకోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తుండగా హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ సంస్థ సుచిర్ ఇండియా సంస్థ మాత్రం ట్వంటీ-20 విశ్వవిజేతలైన భారత క్రికెట్ జట్టు సభ్యులకు అక్టోబర్ 3న ప్లాట్లు ఇచ్చింది. క్రికెటర్లు అంత పేదవారని సుచిర్ ఇండియా సంస్థ ఎలా కనిపెట్టిందో తెలియదు కానీ విశాల హృదయంతో వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇలా ప్లాట్లు ఇవ్వడంతో సుచిర్ ఇండియా సంస్థ మరో పనిచేసినట్టయింది. అదేమంటే దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన క్రికెటర్లను ఒక్కదగ్గరికి తేవడం కోసం కాబోలు..సుచిర్ ఇండియా సంస్థ వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధమయింది.
తమను పట్టించుకోండహో అంటూ నిరాహార దీక్షలకు, ధర్నాలకు దిగుతున్న హాకీ క్రీడాకారులను ఏ సంస్థ పట్టించుకోవడంలేదు..పాపం. ఇదే విషయాన్ని చదరంగం విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్, బిలియర్డ్స్ వరల్డ్ చాంపియన్ పంకజ్ కూడా నొక్కి చెప్పారు. క్రికెటర్లు స్వతహాగా బీదవారైతే వారికి మ్యాచ్ ఫీజ్, ప్రైజ్ మనీ తదితరాలతోపాటు అడ్వర్టైజ్ మెంట్లు చేసినందుకు వారికి భారీగానే ముడుతుంది. అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ సంస్థలు వారికే నజరానాలు ప్రకటిస్తుంటారు. భారతీయతను చాటుతుంటారు. వొళ్లు వంచి కష్టపడి ఆడే హాకీ క్రీడాకారులాంటి వారిని మాత్రం పట్టించుకోరు. కనీసం మర్యాదకోసం కూడా వారిని గుర్తుచేయరు. సుచిర్ ఇండియా లాంటి సంస్థలు తమ వ్యాపారం మూడు పువ్వులు ముప్పై ఆరు కాయలుగా వర్ధిల్లాలనే ఆశతో అడ్డగోలుగా వచ్చిన భూమిని క్రికెటర్లకు పంచిపెట్టడానికి పూనుకుంటోంది. తమ ఇల్లీగల్ వ్యవహారాలను లీగల్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇవేవి తెలియని పిచ్చి అభిమానులు క్రికెటర్లు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడినా హర్షిస్తారు. గెంతులేస్తారు. హారతులు పడతారు. పిల్లికి బిచ్చం వేయడం కూడా తెలియని క్రికెటర్లకు అలాంటి తరహా సంస్థే ఇళ్ల స్థలాలు బహుమతిగా ఇస్తుంటే లోతులు తెలిసిన వారు చూస్తూ ఊరుకోవడం తప్ప చేసేదేముంటుంది చెప్పండి.












Click it and Unblock the Notifications
