చంద్రబాబు వలలో జగన్, వైయస్ మంత్రివర్గం!
శంకర్ రావు పిల్లో తమను ఇంప్లీడ్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, రాజశేఖర రెడ్డి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుతో సహా టిడిపి నేతలు అక్రమాలలో జగన్, దివంగత వైయస్లతో పాటు నాటి మంత్రివర్గంకు సైతం బాధ్యత ఉందని చెప్పుకొస్తున్నారు. ఇటీవల ఓ నేత మాట్లాడుతూ నాటి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని తాము మొదటి నుండి చెబుతున్నామని ఈ అక్రమాలలో జగన్ది 60 శాతం పాత్ర ఉంటే నాటి మంత్రివర్గంది 40 శాతం పాత్ర ఉందని ఆరోపించారు. సాక్ష్యాత్తూ జగన్ పార్టీకి చెందిన నేత అంబటి రాంబాబు అయితే ఆరోపణలు ఖండించడం మాట పక్కన పెట్టి అక్రమాలు జరిగితే జగన్తో పాటు వైయస్ మంత్రివర్గానికి కూడా బాధ్యత అని కుండబద్దలు కొట్టారు. మంత్రివర్గం చేయి లేకుండా అక్రమాలు జరుగుతాయనే ప్రశ్నలు కూడా సామాన్యులను వేధిస్తున్నాయి. నాటి మంత్రివర్గాన్ని కూడా విచారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
సిబిఐ అధికారులు ఇప్పటికే పలు శాఖల అధికారులను దర్యాఫ్తు చేస్తున్నారు. హైకోర్టు పూర్తి విచారణకు ఆదేశిస్తే సిబిఐ వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసిన మాదిరి సంబంధిత నాటి మంత్రుల కార్యాలయాలను కూడా విచారించే అవకాశాలు కొట్టి పారేయలేం. పార్టీని వీడి కాంగ్రెసును దెబ్బతీశాడని సిబిఐ దర్యాఫ్తులో జగన్ అక్రమాలు బయట పడితే ఆయకు శిక్ష తప్పదని కాంగ్రెసు నేతలు పలువురు భావిస్తున్నారు. అయితే టిడిపి మాత్రం కేవలం జగన్తో వదిలి వేయకుండా జగన్ అక్రమాలు తేలితే ఆ తర్వాత నాటి మంత్రి వర్గం విచారణకు డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అసలు జగన్ అక్రమాలు తేలితే మంత్రివర్గం పాత్ర ఉందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ 2జి స్పెక్ట్రం కుంభకోణానికి రాజా ఒక్కడినే బాధ్యుడిగా చేసినట్లు ఇక్కడ కూడా రిపీట్ కావచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు.