వాన్పిక్ ఇష్యూ: వైయస్ ఉన్నట్లా, లేనట్లా?
వైయస్ జగన్ సంస్థల్లో భారీ పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన వాన్పిక్ వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి పాత్ర లేదనే తీరులో సిబిఐ విచారణ ఉందనే ప్రచారం జరుగుతోంది. వాన్పిక్ వ్యవహారంలో అరెస్టయిన మోపిదేవి బెయిల్ దరఖాస్తుకు కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ వాదన చూస్తే, ఈ వ్యవహారంలో వైఎస్కు ఎలాంటి సంబంధం లేదనే పద్ధతి కనిపిస్తుంది. వాన్పిక్ కేసులో మే 24న మంత్రి మోపిదేవిని సిబిఐ అరెస్టు చేసింది. సిబిఐ అరెస్టు తర్వాత మంత్రి పదవికి మోపిదేవి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తాను ఎలాంటి పరిస్థితిలో సంబంధిత ఫైలు మీద సంతకం చేయాల్సి వచ్చిందీ మోపిదేవి తన రాజీనామా లేఖలో వివరించారు.
‘ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత ఫైల్స్ నా కార్యాలయానికి రాకున్నా, సిఎం కార్యాలయానికి తనను పిలిపించి ఆయన కార్యదర్శి సమక్షంలో సంతకాలు పెట్టించారు' అని మోపిదేవి చెప్పారు. అంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఒత్తిడి వల్లే తాను ఫైలుపై సంతకం చేశానని మోపిదేవి ముఖ్యమంత్రికి సమర్పించిన రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. అయితే బెయిల్ కోసం సిబిఐ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో మోపిదేవి ఇందుకు విరుద్ధంగా చెప్పారు. అందులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ప్రస్తావనే లేదు.
రాజీనామా లేఖలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ ఆదేశాల మేరకే సంతకం చేసినట్టు చెప్పిన మోపిదేవి, బెయిల్ పిటిషన్లో మాత్రం అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు మంత్రివర్గం ముందుంచి మంత్రివర్గ ఆమోదం పొందినట్టు చెప్పారు. ‘ఇతరులతో కుట్ర పన్ని పరస్పర విరుద్ధమైన నిబంధనలతో ఉన్న కేబినెట్ మెమోరాండంను, రాయితీ ఒప్పందాన్ని మంత్రివర్గం ముందుంచారు. వాన్పిక్ ప్రాజెక్టులో అవకతవకలు తన దృష్టికి వచ్చినా ప్రభుత్వ ప్రయోజనాలను పరిరక్షించేందుకు మంత్రిగా మోపిదేవి చర్యలు తీసుకోలేదు. వాన్పిక్ వ్యవహారానికి మంత్రిదే పూర్తి బాధ్యత' అని సిబిఐ తన కౌంటర్లో తెలిపింది.
వైయస్ జగన్ మీడియాలో భారీ పెట్టుబడులు పెట్టింది వాన్పిక్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ కూడా అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. మోపిదేవి బెయిల్ పిటిషన్, సిబిఐ కౌంటర్ను పరిశీలిస్తే వాన్పిక్ వ్యవహారంలో ‘క్విడ్ ప్రో కో' విధానంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ను సిబిఐ ఏవిధంగా బాధ్యుడిని చేస్తుందన్నది తెలియడం లేదు. మోపిదేవి రాజీనామా లేఖలోని అంశాలకు, బెయిల్ పిటిషన్లోని అంశాలకు మధ్య వైరుధ్యం ఎందుకు చోటు చేసుకుందనేది కూడా తెలియడం లేదు.