సూపర్ స్టార్ కృష్ణకు పద్మాలయ చిక్కులు
ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రకారం - యాభై ఎకరాల భూమిని చలన చిత్ర అభివృద్ధికి ఎకరా కేవలం 8500 రూపాయల చొప్పున వెల కట్టారు. ఇందులో ప్రముఖ నటుడు కృష్ణ కుటుంబ సభ్యుల సారథ్యలోని పద్మాలయా స్టూడియోస్కు కూడా 9.5 ఎకరాలను కేటాయించారు. "ఈ భూమిని నిర్దేశిత ప్రయోజనాలకు మాత్రమే వాడాలి. అసలు ఉద్దేశం నెరవేరకపోతే భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది'' అని స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాతి క్రమంలో పద్మాలయా స్టూడియోస్కు అనుబంధంగా పద్మాలయ టెలీఫిల్మ్స్ ఏర్పడింది.
కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, కుమారుడు రమేశ్ బాబు తదితరులు డైరెక్టర్లుగా నెలకొల్పిన ఈ సంస్థ జీ-టెలీఫిల్మ్స్తో వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లావాదేవీల్లో నష్టాలు వచ్చాయి. జీ - సంస్థ తాను పెట్టిన 60 కోట్ల పెట్టుబడి తిరిగి చెల్లించాల్సిందిగా పట్టుబట్టింది. డబ్బుకు బదులుగా స్టూడియోకు కేటాయించిన భూమిలో 5.53 ఎకరాలు జీ-టెలీఫిల్మ్స్కు కృష్ణ కుటుంబం కట్టబెట్టింది. మరో నాలుగువేల చదరపు గజాల స్థలాన్ని పద్మాలయ డైరెక్టర్లు 8 మంది తమ పేర్లపై రిజిస్టర్ చేసేసుకున్నారు.
ఈ వ్యవహారమంతా ఇప్పుడు చిక్కుల్లో పడింది. దీంటో పలు న్యాయపరమైన అంశాలు ఇమిడి ఉన్నట్లు అటు ఆంధ్రజ్యోతి, ఇటు టైమ్స్ ఆఫ్ ఇండియా రాశాయి. షేక్ మండలంలోని ఈ భూమిని గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందని, అయితే అది వెనక్కి వెళ్లిందని పత్రికలు రాశాయి.