టెక్కీ నీలిమ మృతి: అసలేం జరిగింది?
భర్తతో భేదాభిప్రాయాలు, అమెరికా నుండి ఆమె పంపిన రూ.25 లక్షల వ్యవహారం, హైదరాబాద్కు వచ్చిన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె బేలగా మారి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. నీలిమ మృతిపై మరిన్ని కోణాలపై పోలీసులు దృష్టి సారించనున్నారు. నీలిమ ఆత్మహత్య కేసు చేధించాలంటే రెండు విషయాలు తేలాల్సి ఉంది. ఒకటి ఫోరెన్సిక్ నివేదిక. రెండూ ఇన్ఫోసిస్ కార్యాలయంలో ఆమె ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది.
ఇప్పటికే ఫోరన్సిక్ నివేదికలో నీలిమది ఆత్మహత్య అని తెలిసింది. ఇక భవనం లోపల ఏం జరిగిందనే అంశంపై ఇప్పటికే తెలిసిన సమాచారంతో పాటు ఇంకా ఏమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. అనుమానాస్పద మరణం, కొన్ని సంఘటనలకు సంబంధించి విషయాలపై పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించారు. ఇన్ఫోసిస్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నప్పుడు బాగానే ఉన్న నీలిమ.. పెళ్లైన తర్వాతనే కొంత మారిందని, భర్తతో భేదాభిప్రాయాలు వచ్చిన అనంతరం కొద్ది రోజులు దూరంగా ఉన్నా.. పెద్దల జోక్యంతో మళ్లీ ఇద్దరు కలిసిపోయారట.
కొద్ది నెలల క్రితం భార్యాభర్తలు అమెరికాకు కూడా వెళ్లొచ్చారు. ఆ తర్వాత ఆమె మరింతగా మనస్తాపం చెందిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారట. ఓ సమయంలో ఆమె తనకు ప్రాజెక్ట్ వర్క్ ఇందని చెప్పి అమెరికాలోనే ఉండిపోయింది. భర్తను మాత్రం ఇక్కడకు పంపించింది. అయితే అమెరికా నుండి ఆమె పంపిన రూ.25 లక్షలు ఆమెకు మనశాంతి లేకుండా చేశాయని తెలుస్తోంది.
పంపిన రూ.20 లక్షలతో వ్యాపారం చేయాలనేది నీలిమ ఉద్దేశ్యమట. హైదరాబాద్ వచ్చాక ఈ డబ్బు విషయమై భర్తతో మనస్పర్థలు వచ్చాయని చెబుతున్నారు. వేదనగానే ఉన్న నీలిమ ఆత్మహత్య చేసుకున్న రోజు కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఆమె ఏం చేసిందనే దానిపై పోలీసులు క్లారిటీగా తెలుసుకుంటున్నారు. దీనిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ప్రశాంత్ తెలిపిన వివరాల ఆధారంగా మరికొన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నారు.