రైలు ప్రమాదం: సైనికుడి కుటుంబం టార్గెట్?
ఈ నేపథ్యంలో కుటుంబం అంతా ఇటీవల డేవిడ్రాజును కలిసేందుకు వెళ్లారు. అక్కడ ఉన్నప్పుడు కూడా బెదిరింపుఫోన్ కాల్స్ వచ్చాయంటున్నారు. సదరు వ్యక్తి హిందీలో బెదిరిస్తూ మాట్లాడేవాడని సమాచారం. తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుని డేవిడ్రాజు కుటుంబీకులందరూ మృత్యువాతపడ్డారు. చనిపోయిన వారిలో డేవిడ్ సతీమణి పొన్నుమణితోపాటు తల్లి ఎలిజిబెత్(46), బావమరిది తవమణి(25), కుమార్తెలు జాస్మిన్ (4), రోజ్మేరీ (3) ఉన్నారు.
డేవిడ్రాజుపై కక్షతో అతని కుటుంబాన్ని హతమార్చాలనే లక్ష్యంతో ఇలా దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని కూడా తమిళ పత్రికల్లో ప్రచురితమైన వార్తల సారాంశం. ఢిల్లీ నుంచి బయలుదేరిన తమిళనాడు ఎక్స్ప్రెస్తోపాటు తమ ప్రయాణాన్ని కూడా ప్రారంభించిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ ఈ బోగీకి ఇన్చార్జిగా ఉన్న టిటితో గొడవపడ్డట్లు కూడా తెలిసింది. ఈ అంశాన్ని రైలులో సహచర ప్రయాణికులై ప్రాణాలతో బయటపడ్డ వారంతా ధ్రువీకరిస్తున్నారు. ఈ కథనాలు ప్రమాదంలో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయ.
తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు బోగీలో 72 సీట్ల సామర్ధ్యం ఉండగా అందులో ఎనిమిది సీట్ల వంతున అమరికగా ఉంటాయి. మూడు బెర్త్లు ఓ వైపున, దానికి ఎదురుగా మూడు బెర్త్లు ఆ ఆరు బెర్త్లకు అభిముఖంగా ప్రయాణికులు అటూ ఇటు నడిచే దారికి ఆవల మరో రెండు బెర్త్లు అడ్డంగా ఉంటాయి. ఇలాంటి అరమరికనే రైల్వే పరిభాషలో ‘బే'గా పిలుస్తారు. ఈ బోగీలో మొత్తం ఎనిమిది బేలున్నాయి. సరిగ్గా ఏడో నెంబర్ బేలో ప్రయాణిస్తున్న వారంతా మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది.
మిగిలిన అన్ని బేల్లోనూ తమ అదృష్టం కొద్దీ ఈ దుర్ఘటన నుంచి తప్పించున్న వారున్నారు. కాలినా శరీర ఆనవాళ్లు కన్పించేటట్టుగా కూడా మృతదేహాలున్నాయి. గాయాల బారిన పడి చికిత్స పొందుతున్న వారు కూడా కనిపిస్తున్నారు. అయితే ఏడో నెంబర్ బేలోనే మృతదేహాల ఆనవాళ్లే కన్పించడం లేదు. ఈ భాగంలో సీటింగ్ కెపాసిటీకి తగ్గట్లుగా ఎనిమిది మందితోపాటు తమిళనాడు కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నపిల్లలు కూడా ప్రయాణిస్తున్నారు. మొత్తం పదుగురూ మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు.