ఎవరీ బిపి ఆచార్య, ట్రాక్ రికార్డు ఏమిటి?
బిపి ఆచార్య పాఠశాల చదువు భువనేశ్వర్లో సాగింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో విశ్వవిద్యాలయం టాపర్గా నిలిచారు. బిఎ (ఆనర్స్)లో రాజకీయ శాస్త్రం, చరిత్రల్లో టాపర్గా వచ్చాడు. 1978లో ఆంగ్లంలో బెస్ట్ డిబేటర్గా ఉత్కల్ విశ్వవిద్యాలయంలో చాన్సలర్స్ కప్ సాధించారు. 1975లో నేషనల్ స్కాలర్షిప్ కూడా పొందారు. ఢిల్లీలోని జెన్యులో అంతర్జాతీయ అధ్యయనం (రాజకీయ శాస్త్రం)లో ఎంఎ చేశారు. అంతర్జాతీయ అర్థిక సంబంధాలపై పరిశోధన చేశారు. జెఎన్యు విద్యార్థి సంఘం కార్యవర్గం సభ్యుడిగా కూడా పనిచేశారు. లార్డ్ మౌంట్ బాటన్ వ్యక్తిగత పత్రాల పుస్తకం మౌంట్ బాటెన్ అండ్ ఇండియా పార్టిషన్ కోసం సంపాదకుడిగా సుప్రసిద్ధ రచయితలు లారీ కోలిన్స్, డోమినిక్ లాపిర్రేలతో కలిసి పనిచేశారు.
1983లో ఆయన ఐఎఎస్కు ఎంపికయ్యారు. 1984 - 85లో చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ పొందారు. 1985-86లో భద్రాచలం అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. 1986లో గోదావరి వరదల సందర్భంగా చేసిన విశేష సేవకు గాను గవర్నర్ నుంచి ప్రశంసాపత్రం కూడా అందుకున్నారు. 1990 - 93లో వరంగల్ కలెక్టర్గా పనిచేశారు. ఇంటాచ్ తరఫున కాకతీయులకు సంబంధించిన సాంస్కృతిక ప్రాశస్త్యంపై గ్రంథాలు తెచ్చారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు గొల్కొండ ఫోర్ట్కు సంబంధించి సన్ - ఇట్ -లూమినరేను రూపొందించారు. డిసెంబర్ 1993 నుంచి 1996 జనవరి వరకు రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్గా మామిడి ఎగుమతులకు సంబంధించి చేసిన కృషికి జాతీయ అవార్డును పొందారు. సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్గా జన్మభూమి పథకం ప్రచార సామగ్రిని రూపొందించడంలో కీలక భూమిక పోషించారు.
ఎపి డెయిరీ డెవలప్మెంట్ సహకార సమాఖ్య మేనేజంగ్ డైరెక్టరుగా పది లక్షల మంది రైతుల వార్షిక టర్నోవర్ను రూ.800 కోట్లకు పెంచడంలో ఆయన కృషి, మేధోసంపద ఉంది. హైదరాబాదుకు రికార్డు టైమ్లో కృష్ణా జలాల తరలింపు పథకాన్ని పూర్తి చేసిన ఘనత కూడా ఆచార్యకు దక్కుతుంది. అంతేకాకుండా, హైదరాబాదులోని నగరవాసుల మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి డయల్ ఎ ట్యాంకర్ పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా ఆయనే. ఆయన కెరీర్లో చెప్పుకోదగిన వాటిని ఇంకా చాలా సాధించారు. కానీ ఎమ్మార్ వ్యవహారమే ఆయన కొంప ముంచింది.