చెన్నై సూపర్ కింగ్స్కు మూడిందా?
చెన్నై: ఈ సీజన్లో ఫైనల్లో అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడినట్లేనని ప్రచారం సాగుతోంది. బిసిసిఐ - ఐపియల్ నిబంధనల ప్రకారం క్రికెట్కు లేదా ఐపియల్కు చెడు పేరు తెచ్చేలా ఫ్రాంచైజీ యాజమాన్య సంస్థ లేదా యజమాని ప్రవర్తిస్తే ఆ ఫ్రాంచైజీని రద్దు చేసే అధికారం బిసిసిఐకి ఉంటుంది. అయితే, బిసిసిఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ వ్యవహరిస్తున్న స్థితిలో అది సాధ్యమేనా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.
నిజానికి, బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసన్ ఐపియల్ ఫ్రాంచైజీని కలిగి ఉండకూడదు. అయితే, సాంకేతికంగా ఆ జట్టు తనది కాదనే ఏర్పాట్లను శ్రీనివాసన్ చేసుకున్నారు. శ్రీనివాసన్ ఎండిగా ఉన్న ఇండియన్ సిమెంట్స్ చెన్నై సూపర్ కింగ్స్కు యజమానిగా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ జట్టు ప్రిన్సిపల్గా ఉన్న గురునాథ్ మేయప్పన్ బెట్టింగ్ ఆరోపణలతో అరెస్టయ్యారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ను బిసిసిఐ రద్దు చేసే అవకాశం ఉంది.

అయితే, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఇండియన్ సిమెంట్స్ చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గురునాథ్ తమ జట్టుకు యజమాని గానీ సిఇవో గానీ కాడని, ఆయన కేవలం గౌరవ సభ్యుడు మాత్రమేనని ఇఁడియా సిమెంట్స్ శుక్రవారంనాడు ప్రకటించింది. గురునాథ్తో తమకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేసింది.
అంతకు ముందు, ట్విట్టర్ పేజీల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపల్ అనేది కొనసాగుతూ వచ్చింది. ఇండియా సిమెంట్స్ ప్రకటన వెలువడగానే అది ఎగిరిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ వెబ్సైట్లో కూడా గురునాథ్ పేరు ఎగిరిపోయింది. మొత్తంగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో గురునాథ్కు ఉన్న సంబంధం కాదనలేనిది. ఈ స్థితిలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ విషయంలో బిసిసిఐ ఏం చేస్తుందనేది వేచి చూడాల్సిందే.
బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని శ్రీనివాసన్పై ఒత్తిడి పెరుగుతోంది. ఐపియల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ శ్రీనివాసన్పై యుద్ధం ప్రకటించినట్లే కనిపిస్తున్నారు. శ్రీనివాసన్ తప్పని స్థితిలో బిసిసిఐ అధ్యక్ష పదవిని కోల్పోతే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ దశ కూడా మారవచ్చు.












Click it and Unblock the Notifications