ఫొటోలు: సంక్రాంతి సంబరాల రంగులు
హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం తెలుగు ప్రజలకు అత్యంత ప్రధామైంది. ఉత్సాహంతో జరుపుకునే సంబరాల కాలం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఈ పండుగను అత్యంత వేడుకగా జరుపుకుంటారు. పంటలు ఇళ్లకు వచ్చే కాలం కాబట్టి గ్రామీణ రైతుల ముఖాలు కూడా కలకలలాడుతుంటాయి.
మహిళలు గొబ్బెమ్మలు పెడుతూ, చిత్రవిచిత్రమైన ముగ్గులు వాకిలిని ఓ సౌందర్య వేదికగా తయారు చేస్తారు. భోగీ మంటలకు పిడకలు కూడా వాడుతారు. ఇళ్లకు దాసర్లు వస్తుంటారు. గంగిరెద్దులూ వస్తుంటాయి. ఇళ్ల యజమానులకు అవి వంగి నమస్కారాలు చేస్తాయి.
సంక్రాంతి పర్వదినం మూడు రోజుల పాటు వివిధ రూపాల్లో జరుగుతుంది. బోగితో ప్రారంభమై కనుమతో ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా గ్రామీణ సంపదను ప్రతిఫలిస్తుంది. వ్యవసాయానికి ఈ పండుగకు సంబంధం ఉంది. పశుసంపదకు కూడా ఇది ప్రతీకగా నిలుస్తుంది. పిల్లలు పతంగులు ఎగురేస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు. తోకపిట్టల్లా పతంగులు ఎగురుతుంటే ఎగిరి గంతులేస్తుంటారు.
ఫొటోలు:
కందుకూరి
రమేష్
బాబు
సంక్రాంతి పండుగ దినాల్లో వాకిలిని పేడనీళ్లతో అలికి, ముగ్గులతో అలంకరించడానికి ఇలా రంగులు విడివిడిగా పెట్టుకుంటారు.
మహిళలు తమ వేలి కొసలతో పిండిని, సుద్దను చేతులను విన్యాసంగా తిప్పుతూ ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులు వేయడం ఓ కళ. చిత్రవిచిత్ర లిపులను ఈ ముగ్గులు ఆవిష్కరిస్తాయి.
మహిళలు పోటీలు పెట్టుకుని ముగ్గులు వేస్తుంటారు. ఎవరి ముగ్గు గొప్పగా ఉందో చర్చించుకుని పొంగిపోతుంటారు. ఇదో అనందం..
ఆవుపేడకు ఈ సంక్రాంతికి ప్రత్యేకత ఉంది. పేడతో గొబ్బెమ్మలు తయారు చేస్తారు. పిడకలు చేసి గోడలకు కొడతారు.
గంగిరెద్దులను ఓ ప్రత్యేకమైన వర్గం ఇంటింటికీ తిప్పుతుంది. ఎద్దులను అందంగా అలంకరించి, ఇళ్ల వెళ్లి బిక్షాటన చేస్తారు. దాన్ని వారు హక్కుగా భావిస్తారు. ఎడ్లను ముస్తాబు చేయడానికి ఇలా..
గంగిరెద్దులు ఇలా అత్యంత సుందరంగా ముస్తాబై తమ యజమాని చెప్పినట్లల్లా ఆడుతాయి. నృత్యం చేస్తాయి, వంగి దండాలు పెడతాయి. ఏది చెప్తే అది చేస్తాయి.