డయానా తర్వాత రెండున్నర దశాబ్దాలకు: ఇవాంకా మాత్రమే
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు, శ్వేత సౌధం సలహాదారు ఇవాంకా ట్రంప్కు హైదరాబాదులో రెడ్ కార్పెట్ పరిచారు. ఆమె రాక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు, శ్వేత సౌధం సలహాదారు ఇవాంకా ట్రంప్కు హైదరాబాదులో రెడ్ కార్పెట్ పరిచారు. ఆమె రాక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆమె ప్రయాణించే రోడ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఆమెకు ఇస్తున్న ప్రాధాన్యతపై సర్వత్రా చర్చ సాగింది.
అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా ఇవాంకా: హోటల్లో ఇలా, ఇవాంకా కోసం సిటీలో రోడ్డెక్కారు!
ఇవాంకా ట్రంప్ మంగళవారం వేకువజామున హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం 34 వాహనాలు కలిగిన కాన్వాయ్తో మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్కు చేరుకున్నారు. ఆమె కోసం పోలీసులు రోడ్లను ఖాళీగా ఉంచారు.
రెండున్నర దశాబ్దాల తర్వాత
శంషాబాద్ నుంచి మాదాపూర్ వరకు ఆ రోడ్డులో ఏ వాహనాలు లేకుండా చేశారు. ఇవాంకాకు అత్యంత భద్రత కల్పించారు. ఇవాంకా పర్యటన నేపథ్యంలో కొందరు ఇరవై అయిదేళ్ల క్రితం వచ్చిన డయానా పర్యటనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. హైదరాబాదులో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితి చూశామని చెబుతున్నారు.
1992లో హైదరాబాద్కు డయానా
1992 పిబ్రవరిలో ప్రిన్సెస్ డయానా హైదరాబాద్ వచ్చారు. అప్పుడు కూడా ఆమె రాక నేపథ్యంలో ఇలాంటి భద్రతా ఏర్పాట్లే చేసారు. డయానా తర్వాత మళ్లీ దశాబ్దాల తర్వాత ఓ విదేశీ మహిళా నేతకు అలాంటి ప్రాధాన్యత కల్పించారని అంటున్నారు. డయానా తర్వాత మళ్లీ రెడ్ కార్పెట్ పరిచింది ఇవాంకాకే అని గుర్తు చేసుకుంటున్నారు.
1983లో క్వీన్ ఎలిజబెత్
అంతకుముందు క్వీన్ ఎలిజబెత్ 1983 నవంబర్ నెలలో హైదరాబాద్ వచ్చారు. ఆమెకు కూడా గ్రాండ్ వెల్కం లభించింది. క్వీన్ ఎలిజబెత్, డయానాలకు రెడ్ కార్పెట్ పరిచారు. అయితే ఓ అమెరికా మహిళా నాయకురాలికి ఇంతలా రెడ్ కార్పెట్ పరచడం ఇదే తొలిసారి అంటున్నారు.
కొత్త రాష్ట్రంలోకి స్వాగతం
కాగా, ఓ వైపు ప్రధాని మోడీ, మరోవైపు ఇవాంక రాకను దృష్టిలో ఉంచుకునే తెలంగాణ పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. వేలాది మంది సిబ్బందిని మోహరించింది. తొలిరోజు ప్రశాంతంగా ముగిసిపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇవాంకా ట్రంప్ విమానం శంషాబాద్ చేరుకుంది. భారత్లో అమెరికా రాయబారి జుస్టర్, అమెరికాలో భారత రాయబారి నవతేజ్సింగ్ శరన్, హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్రంజన్, శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, సీఐడీ ఐజీ షీకాగోయల్ ఆమెకు స్వాగతం పలికారు. భారతదేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోకి స్వాగతం అంటూ అంజనీకుమార్ చెప్పగానే ఇవాంక చిరునవ్వు చిందించారు.