మూడు రోజులు లేదంటే వారానికోసారి : తెలంగాణలో బస్తీ వాసి గొంతు తడిచేదెలా?

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాలు, నగర వాసులు దాహార్తి తీర్చుకునేందుకు సరిపడా తాగునీరు లభించక అల్లాడిపోతున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాలు, నగర వాసులు దాహార్తి తీర్చుకునేందుకు సరిపడా తాగునీరు లభించక అల్లాడిపోతున్నారు. రోహిణి కార్తెకు ముందే సూర్య భగవానుడి భగభగలకు తోడు.. అడుగంటిన భూగర్భ జలాలతో పట్టణాలు, నగరాల వాసులు తీవ్ర తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి.

తమ అవసరాలకు సగంలోపే ప్రభుత్వ సాగునీటి సరఫరా వ్యవస్థలు సరఫరా చేస్తుండటంతో బస్తీ వాసుల ఇక్కట్లు అవసరంలో సగం లోపే సరఫరా అవుతుండటంతో పట్టణ జనం ఇక్కట్ల పాలవుతున్నారు. రెండు, మూడు రోజులు.. కొన్ని చోట్ల వారానికి ఓ సారి వచ్చే పావుగంట, అరగంట సరఫరా చేస్తున్న నీటితోనే ప్రజానీకం సర్దుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు సరఫరా చేయాల్సిన నీటిలో సగానికి పైగా కోతపడింది. మున్సిపాలిటీల్లో అత్యధికం భూగర్భ జలాలపైనే ఆధారపడి విధులు నిర్వహిస్తున్నాయి.

కానీ భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు నిరుపయోగంగా మారుతుండటంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కొన్నిచోట్ల అందుబాటులో ఉన్న జల వనరులు, కాలువల నుంచి కూడా నీటి సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా.. అది పరిమితంగానే ఉంది. మరోవైపు మంచినీటి పైపులైన్లు పగిలిపోవడం, లీకేజీలు, ఇతర సాంకేతిక సమస్యలతో నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతున్నది. తెలంగాణలోని 18 మున్సిపాలిటీల్లో చాలా తక్కువ రోజులకు సరిపడే నీరు మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Drinking water crisis in Telangana

గతేడాది వర్షాలు కురిసినా భగ్గుమంటున్న ఎండలు
గత సీజన్‌లో ఇబ్బడి ముబ్బడిగా వర్షాలు కురిసినా ఎండాకాలం వచ్చే సరికి గతేడాది కంటే దారుణంగా పరిస్థితులు మారిపోవడంతో పట్టణ వాసులు అల్లాడి పోతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నీటి ఎద్దడి నివారణకు ఎంతైనా ఖర్చు చేస్తామని, నిర్ణయాధికారం ఆయా జిల్లాల కలెక్టర్లకే అప్పగించామని పేర్కొన్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొదలు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు నుంచి పంచాయతీ రాజ్, గ్రామీణాభివ్రుద్ధి శాఖ మంత్రి జూపల్లి క్రుష్ణారావు వరకు... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్... గ్రామీణాభివ్రుద్ధి శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ మొదలు జిల్లా కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని చెప్తూనే ఉన్నారు. అవసరమైతే ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కానీ గత ఏడాది తాగునీటిని సరఫరాచేసేందుకు ముందుకు వచ్చిన ప్రైవేట్ ట్యాంకర్ల బిల్లులు మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యాజమాన్యాలు ఏ మేరకు ప్రభుత్వానికి సహకరిస్తాయన్నదీ అనుమానమేనని చెప్తున్నారు. గత రెండేళ్లుగా మున్సిపాలిటీల్లోని అధికార యంత్రాంగం తమకు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం వల్లే తాగునీటి సమస్య తీవ్రతరమైందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

నీటి లభ్యతకు అనుగుణంగా నీటి సరఫరా

అందుబాటులో ఉన్న నీటి సరఫరా వ్యవస్థల పరిస్థితికి అనుగుణంగా ఆయా మున్సిపాలిటీలు తాగునీటిని పంపిణీ చేస్తున్నాయి. కొన్ని పట్టణాల్లో మూడు రోజులకోసారి, నాలుగు రోజులు, ఐదు రోజులు, వారానికి ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్న పట్టణాలు కూడా ఉన్నాయి. నల్లగొండతోపాటు వనపర్తి, సూర్యాపేట, సదాశివపేట, ఫిర్జాదీగూడ, నర్సంపేట, మహబూబాబాద్‌, కోదాడ, కల్వకుర్తి, జిల్లెలగూడ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో మూడు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతున్నది. ఇక రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ తోపాటు మంచిర్యాల జిల్లా మందమర్రి, భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణాల్లో నాలుగు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులకు 34,892 మంది జనాభా ఉన్నారు. వీరికి 4.5 ఎంఎల్‌డీ నీరు అవసరం ఉండగా పురపాలక సంస్థ ద్వారా కేవలం 3 ఎంఎల్‌డీల నీటి సరఫరా అదీ నాలుగు రోజలకోసారి జరుగుతోంది. భానుడి ప్రతాపంతో ఇల్లెందు చెరువు అడుగంటడంతో నీటి ఎద్దడి తీవ్రతరం దాల్చింది. అధికార యంత్రాంగానికి ముందుచూపు లేకపోవడంతో కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో రెండేళ్లుగా నీటి సమస్య తీవ్రమైంది. ఐదు రోజులకు ఒకసారి సరఫరా చేస్తుంటారు. జమ్మికుంట పట్టణంలో ఒక్కోసారి అంతకంటే ఎక్కువ రోజుల దాకా తాగునీటి సరఫరా ఉండదు. ఇక పాత మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్ల, షాద్ నగర్, నారాయణ పేట పట్టణాల పరిధిలో వారానికోసారి నీటి సరఫరా జరుగుతోంది.

Drinking water crisis in Telangana

రెండు మున్సిపాలిటీల్లోనే 135 లీటర్ల సరఫరా

సగటున ఒక వ్యక్తికి రోజుకు 135 లీటర్ల తాగునీటిని సరఫరా చేయడం లక్ష్యం. ఈ మేరకు కేవలం రెండు పట్టణ స్థానిక సంస్థలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. 70 లీటర్ల నుంచి 135 లీటర్లలోపు నీటి సరఫరా చేస్తున్నవి 30 పురపాలక సంస్థలు ఉన్నాయి. 70 లీటర్ల కంటే తక్కువ సరఫరా చేస్తున్నవి సగానికి పైగా అంటే 40 స్థానిక సంస్థలు ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని పట్టణాల్లో భూగర్భ జలమట్టాలు పడిపోతుండటంతో వేల బోర్లు ఎండిపోతున్నాయి. పురపాలక సంస్థల్లో భూగర్భ జలవనరుల ద్వారా రోజుకు 117 ఎంజీడీల నీరు సరఫరా కావాల్సి ఉండగా కేవలం 64 ఎంజీడీలు మాత్రమే సరఫరా అవుతోంది. నీటి సరఫరాలో కీలకంగా ఉండే పవర్‌ బోర్లు పనిచేయకపోవడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. మొత్తం ఐదు వేల పవర్‌ బోర్లలో 500 బోర్లు పనిచేయడం లేదు.

మిషన్ భగీరథ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తుందా?

ప్రతియేటా వేసవిలోనే వివాహ వేడుకలు, ఇతర కార్యక్రమాలు జోరుగా సాగుతుంటాయి. వివాహాలు జరుపుకునే వారు తాగునీటి కోసం భారీగా డబ్బు కేటాయించాల్సి వస్తుంది. ఇక సాధారణంగానే వేసవిలో తాగునీరు ఎక్కువగా కావాలి. లేదంటే నీరసపడిపోతారు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే మినరల్ వాటర్ కొనుక్కుని తాగాల్సిందే. సంపన్నులు, మధ్య తరగతి వారు, ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు, లాయర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు కూడా మినరల్ వాటర్ కొనుక్కోగలరు. కానీ సామాన్యులు.. ప్రతిరోజూ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలు మినరల్ వాటర్ కొనుగోలు చేయాలంటే వారి సంపాదనలో సగానికి పైగా మినరల్ వాటర్ కొనుగోలు చేయడానికే సరిపోతుంది. కనుక వారంతా ప్రభుత్వం, మున్సిపాలిటీలు సరఫరా చేసే నీటిని నిల్వ ఉంచుకుని పొదుపుగా వాడుకుంటూ కాలం వెల్లబుచ్చాల్సిన దుస్థితి నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన 'మిషన్ భగీరథ' పథకాన్ని గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ వాసులకు అందుబాటులోకి తీసుకొస్తేనే కొంతైనా ఉపశమనం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+