గెయిల్ ఎఫెక్ట్: సిఎన్జీ బంద్, బస్సులకు బ్రేకులు
హైదరాబాద్: హైదరాబాదు, సికింద్రాబాద్ జంటనగరాల్లో సీఎన్జీ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సీఎన్జీ గ్యాస్తో నడిచే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మేడ్చల్ మండలం పూడూరు కేంద్రంగా సీఎన్జీ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే మేడ్చల్, హకీంపేట, మియాపూర్ ఆర్టీసీ డిపోలకు, హైదరాబాద్లోని 11 సీఎన్జీ పెట్రోల్ బంక్లకు సీఎన్జీ గ్యాస్ సరఫరా అవుతుంది.
గ్యాస్ కొరతతో 54 బస్సులు డిపోల్లో నిలిచిపోయాయి. బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా నగరం దుర్ఘటనతో గ్యాస్లైన్ మళ్లీ చెక్ చేయాలని గెయిల్ సంస్థ ఆదేశంతో గ్యాస్ సరఫరాను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్లో మంగళవారం నుంచి సీఎన్జీ పూర్తిగా ఆగిపోయింది. సరఫరా నిలిచిపోవడంతో ఆ గ్యాస్ ఆధారంగా నడిచే వాహనాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నగరంలోని 10 సీఎన్జీ బంకుల్లో సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో సీఎన్జీ సరఫరా ఆగిపోయిందని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. ఆ పైప్లైన్ పునరుద్ధరణ తరువాతే సీఎన్జీ సరఫరా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
నగరంలోని ఆర్పీ రోడ్డు, నారాయణగూడ, నింబోలి అడ్డ, ఎల్బీనగర్లోనీ ఎన్టీఆర్ నగర్, వనస్థలిపురం, బాలానగర్, బాలాపూర్, లంగర్హౌజ్, జుమ్మెరాత్బజార్, జూపార్క్ ప్రాంతాల్లోని సీఎన్జీ బంకుల వద్ద ‘నో స్టాక్' బోర్డులు వెలిశాయి.
సీఎన్జీ గ్యాస్పై నగరం, శివారు ప్రాంతాల్లో దాదాపు వేలాది ఆటోలు, రెండు వందల ఆర్టీసీ బస్సులు, 4500 కార్లు, యాభై క్యాబ్లు నడుస్తున్నాయి. వరంగల్, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లోనూ సీఎన్జీ వాహనాలకు ఇంధన కొరత తప్పదని రవాణా శాఖ వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications