దేశంలో ఇంత డొల్లా?: ఒక్క హైదరబాద్ లోనే వందల కొద్ది, సుజనా కంపెనీ డైరెక్టర్లపై నిషేధం..
ఆ కంపెనీలన్ని కేవలం పేపర్ల మీదే కనిపిస్తాయి. అడ్డగోలుగా ఆర్థిక అవకతవకలు పాల్పడుతూ కోట్ల కొద్ది టర్నోవర్ ను చూపిస్తుంటాయి.
Recommended Video
హైదరాబాద్: ఆ కంపెనీలన్ని కేవలం పేపర్ల మీదే కనిపిస్తాయి. అడ్డగోలుగా ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ కోట్ల కొద్ది టర్నోవర్ ను చూపిస్తుంటాయి. ఈ డొల్ల కంపెనీల్లో ప్రవహించేది చాలావరకు నల్లధనమే.
అలాంటి డొల్ల కంపెనీలు దేశవ్యాప్తంగా వేలకొద్ది పుట్టుకొచ్చాయి. డొల్ల కంపెనీల జాబితాలో ముంబై, ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డొల్ల కంపెనీలపై ఫోకస్ చేసిన కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ వాటికి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న 41,068 మందిపై తాజాగా అనర్హత వేటు వేసింది.
తప్పుడు లెక్కలు..:
కేవలం నల్లధనాన్ని వైట్ గా మార్చే ప్రక్రియలో భాగంగా ఏర్పడ్డ ఈ కంపెనీలు.. ఇష్టారీతిన లెక్కల్ని తారుమారు చేస్తున్నాయి. ఏదో ఒక పేరుతో కంపెనీ పెట్టడం, అందులో ఎటువంటి కార్యకలాపాలు లేకపోయినా.. పెట్టుబడులు తీసుకొచ్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఆఖరికి ఆదాయ రిటర్నులు కూడా దాఖలు చేయని కంపెనీలు కూడా చాలానే ఉన్నాయి.
హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రీజియన్ ఈ షెల్ కంపెనీలకు అడ్డాగా మారిందని కార్పోరేట్ వ్యవహారాల శాఖ తేల్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అలాంటి వేల సంఖ్యలో కంపెనీలు, వాటిల్లోని 41,068 మంది డైరెక్టర్లపై వేటు వేసింది. వచ్చే ఐదేళ్ల పాటు వారు కంపెనీలు పెట్టకుండా, మరే కంపెనీలోను డైరెక్టర్లుగా చేరకుండా నిషేధం విధించింది.
ఆ రెండు కారణాలతో:
డొల్ల కంపెనీలకు డైరెక్టర్లకు వ్యవహరిస్తున్నవారి జాబితా సిద్దం చేసిన కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ 'డైరెక్టర్ డిస్క్వాలిఫై సెక్షన్ 164(2)(ఏ)' చట్టం కింద వారిని తొలగించేందుకు సిద్దపడింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలను ప్రస్తావిస్తోంది.
2013-14, 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నివేదికలు, వార్షిక రిటర్నులు సమర్పించకపోవడం ఒక కారణం కాగా.. డిపాజిట్లను తిరిగి చెల్లించడంలో ఏడాది పాటు నిర్లక్ష్యం చేయడం, ఏళ్లకేళ్లు ఎగ్గొడుతూ రావడం మరో కారణంగా చూపించింది.
'సుజనా' కంపెనీ డైరెక్టర్లు కూడా!:
కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ సిద్దం చేసిన అనర్హుల జాబితాలో కేంద్ర సహాయ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరికి చెందిన సుజనా పవర్ ఇండియా లిమిటెడ్ సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లు శంకర్ కుందులా, హనుమంతరావు, శ్రీనివాస గొట్టుముక్కల కూడా ఉండటం గమనార్హం.
డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెందిన అంజిరెడ్డి, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్, డెక్కన్ మార్కెటింగ్, డెక్కన్ పవర్ లిమిటెడ్ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న తిక్కవరపు మంజూల, వెంకట్లతో పాటు మరో డైరెక్టర్ కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు.
ప్రొగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ డైరెక్టర్ నాగేశ్వర్రావు, మెగా సిమెంట్స్ అండ్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు, విజయవాడ షేర్ బ్రోకర్స్ లిమిటెడ్ 12 మంది, ఎస్కే బిగ్స్టార్ ఫుడ్స్ లిమిటెడ్కు చెందిన 12 మంది, వంశీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన ఆరుగురు, కీర్తి అనురాగ్ ఇన్వెస్ట్మెంట్స్కు చెందిన 9 మంది, కోరమాండల్ పెస్టిసైడ్స్ సంస్థ డైరెక్టర్లు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు.
మూడో స్థానంలో హైదరాబాద్:
కార్పోరేట్ శాఖ నిర్ణయం మేరకు వేటు పడ్డ డైరెక్టర్లంతా 2016 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ చివరి వరకు ఏ కంపెనీలోను డైరెక్టర్ గా కొనసాగడానికి అనర్హులు. అలాగే వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తారు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
కాగా, దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కంపెనీలు, డైరెక్టర్లపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ అనర్హత వేటు వేయగా.. అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో 74,920 మంది డైరెక్టర్లపై వేటు వేసింది. వాటి తర్వాత 66,851 మందితో ముంబై రెండో స్థానంలో, 41,068 మందితో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి. వీటి తర్వాత 14 వేల మందితో ఎర్నాకులం, 11,383 మందితో కటక్ ఉన్నాయి.
అగ్రిగోల్డ్, నార్నే కంపెనీల డైరెక్టర్లపై కూడా:
తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందికి కుచ్చు టోపీ పెట్టిన అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫామ్స్ డైరెక్టర్లు అవ్వా శివరాం, అవ్వా శర్మ, వెంకట్ కృష్ణలపై కూడా వేటు పడింది.
రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్కు చెందిన 8 మంది డైరెక్టర్లు, హైదరాబాద్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్కు చెందిన నలుగురిపై వేటు పడింది.
ఇక నార్నే హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మార్వెల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్లు నార్నే రావు, నార్నే శ్రీనివాసరావు, నార్నే మల్లీశ్వరి, గద్దె శ్రీవెంకట్, నార్నే సుబ్బాయమ్మ, గద్దె విజయశ్రీలపై కూడా నిషేధం తప్పలేదు.
ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్తో పాటు అందులో డైరెక్టర్లుగా ఉన్న ఐదుగురిని, ఎప్పటి నుంచో వివాదాల్లో ఉన్న సంఘీ ఇండస్ట్రీస్, ఆ కంపెనీల్లోని డైరెక్టర్లపైనా వేటు వేసింది.