మన ‘ఆధార్’ డాటా సురక్షితమేనా?
వివిధ ధ్రువపత్రాలను అనుసంధానించే ‘ఆధార్’ వల్ల విస్తృత ప్రయోజనాలున్నట్లే అంతేస్థాయిలో ప్రమాదం ఉన్నదని అంటున్నారు.
వంట గ్యాస్, పంట రుణం, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, బ్యాంకు ఖాతా, సిమ్కార్డు, విద్యార్హతల ధ్రువపత్రం తదితరాలన్నీ ఒకదానికొకటి సంబంధం లేదు. కానీ వీటన్నింటినీ కలుపుతున్నది ఆధార్. ఈ 12 అంకెల సంఖ్యను తప్పనిసరి చేస్తుండడంతో సమస్త సమాచారం ఒకే ఛత్రం కిందకు వచ్చేస్తోంది.
దీంతో వివిధ ధ్రువపత్రాలను అనుసంధానించే 'ఆధార్' వల్ల విస్తృత ప్రయోజనాలున్నట్లే అంతేస్థాయిలో ప్రమాదం ఉన్నదని అంటున్నారు. ముఖ్యంగా పౌరుల వ్యక్తిగత సమాచారానికి భ్రదత లేకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఇది ప్రభుత్వ పథకాల అమలలో ఖచ్చితత్వానికి, అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయడానికి, అక్రమార్కుల పని పట్టడానికి మేలైన సాధనమని, ప్రతి భారత పౌరుడికీ ఇది తిరుగులేని గుర్తింపు అని ప్రభుత్వం చెబుతోంది.
ప్రతి దానికీ ఆధార్ అనుసంధానం చేయడం వల్ల ప్రజల బ్యాంకు ఖాతాల సంఖ్యలు, ఈ - మెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత సమాచారం ఇతరులు తెలుసుకునే ప్రమాదం ఉంది. సైబర్ నేరగాళ్లు సులభంగా డాటా తస్కరించొచ్చు.
ఈ సమాచారం ప్రభుత్వం వద్దే ఉన్నా భరోసా లేదు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ శాఖల వెబ్సైట్లలోనే ఆధార్ సమాచారం నేరుగా పెట్టేసిన ఉదంతాలు ఇటీవల బయటపడటమే దీనికి ఉదాహరణ. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు, ప్రయాణ టిక్కెట్లు వంటివాటికి ఇది తప్పనిసరి చేస్తే వ్యక్తిగత గోప్యత అన్నది లేకుండా పోతున్నది. దేశంలో ఏ పౌరుడి వ్యక్తిగత, ఆర్థిక సమాచారం కూడా ప్రభుత్వం తెలుసుకోవచ్చు.
అంతేకాదు. ఎక్కడికి వెళ్లారు, ఎన్నిసార్లు వెళ్లారు, ఎక్కడ ఉన్నారు వంటి చిన్నచిన్న విషయాలు కూడా తెలిసిపోతాయి. దేశ పౌరుల కదలిలకలపై నిఘా పెట్టడానికి అన్ని అవకాశాలుంటాయి. ప్రత్యేకించి సంఘ విద్రోహ శక్తులు, బడా మార్కెట్ వర్గాలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ సంస్థల చేతికి మన సమాచారమంతా చిక్కే ప్రమాదముంది.
రేషన్ కార్డుల అనుసంధానంతో రూ.14 వేల కోట్ల ఆదా
వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో రాయితీల్లో అక్రమాలు, ప్రభుత్వ పథకాల్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి తిరుగులేని మార్గం ‘ఆధార్'. నేరాలు జరిగినప్పుడు అక్కడ ఉన్న వేలిముద్రలను, ఆధార్ డాటాబేస్లోని వేలిముద్రలతో పోల్చి తొందరగా పట్టుకునేందుకు వీలు కలుగుతుంది. సరైన వ్యవస్థ రూపొందిస్తే చాలావరకు నేరగాళ్ల కదలికలను ముందే గుర్తించడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అన్ని రకాల ప్రయాణ టిక్కెట్లకు ఆధార్ సంఖ్య తప్పనిసరి చేసినప్పుడు ఇది కొంతవరకు సాధ్యమవుతుంది. చిరునామా, గుర్తింపు ధ్రువపత్రంగా పనికొస్తుంది కాబట్టి ఏ ఇతర గుర్తింపు కార్డులు లేనివారికి ఇదే ఆధారం. ఇప్పటికి 78 పథకాలకు ‘ఆధార్' అనుసంధానంతో రూ.49 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదా అయింది. ఒక్క రేషన్ కార్డులతో అనుసంధానం వల్లే ఇప్పటివరకు రూ.14 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకోగలిగింది.
ఇదీ భద్రతపై ప్రభుత్వ వాదన ఇలా
జార్ఖండ్ సామాజిక భద్రత పింఛన్ల విభాగం వెబ్సైట్తో అనుసంధానించిన 10 లక్షల మంది ఆధార్ సమాచారం బయటపడింది. బీహార్ అల్పసంఖ్యాక శాఖ వెబ్సైట్లో 30 వేల మంది విద్యార్థుల ఆధార్, బ్యాంకు ఖాతాల సంఖ్యలు బహిరంగ పరిచారు. అలాగే పంజాబ్ అల్పసంఖ్యాక శాఖ వెబ్సైట్లో 12 వేల మంది విద్యార్థుల ఆధార్, బ్యాంకు ఖాతాల సంఖ్యలు బహిరంగంగా వెల్లడించేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మక పథకం స్వచ్ఛభారత్ లబ్ధిదారుల సమాచారం కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ నుంచి లీకైంది. ఇవే కాక ఛండీగఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వివిధ శాఖల పోర్టళ్లలోనూ పౌరుల ఆధార్ వివరాలు బయటపడ్డాయి. ఆధార్ కోసం పౌరుల వివరాలు సేకరిస్తున్న సంస్థలు ఆ సమాచారాన్ని తమ సొంతం చేసుకునే అవకాశం లేని అత్యాధునిక విధానాలు ఉపయోగిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. అంతర్జాతీయంగానే అత్యంత సురక్షితమైన సమాచార భద్రత విధానమని పేర్కొంటున్నది. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయరాదని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు, బ్యాంకు కార్డులు తెరవడం తదితర సంక్షేమేతర అవసరాలకు వాడొచ్చు.
గోప్యతపై నందన్ నీలేకని ఇలా
మనం నిత్యం వాడే స్మార్ట్ఫోన్లలో సెన్సర్లు, జీపీఎస్ వంటివాటి వల్ల మనకు సంబంధించిన సమాచారం ఎక్కడో విదేశాల్లో ఉన్న సర్వర్లకు చేరుతున్నదని యూఐడీఏఐ మాజీ చైర్మన్ నందన్ నిలేకని తెలిపారు. కొన్ని ఫోన్లలో మనకు తెలియకుండా మన సంభాషణలు నమోదయ్యే ప్రమాదమూ ఉన్నదని, ఇప్పుడు ఏటీఎంలు సహా ప్రతి చోటా సీసీ కెమేరాలు ఉంటున్నాయి. వాయిస్ గుర్తింపు టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటివి వచ్చేశాక ఇంకా గోప్యత అన్నది ఎక్కడ ఉన్నదని ప్రశ్నించారు. కనుక ఆధార్ సమాచారం ప్రభుత్వం వద్ద సురక్షితంగా ఉంటుందన్నారు. అయినప్పటికీ కేంద్రం సమాచార భద్రతకు ప్రత్యేక చట్టం చేస్తే మంచిదని సూచించారు.
క్రెడిట్ కోడ్ గుర్తింపుకార్డులిస్తున్న చైనా
2006లో బ్రిటన్లోని టోనీ బ్లెయిర్ ప్రభుత్వం రూపొందించిన ‘గుర్తింపు కార్డుల చట్టం' మన ఆధార్ కార్డుల వంటిదే. ‘జాతీయ గుర్తింపు నమోదు' పేరిట భారీ సమాచార నిధి ఏర్పాటుచేసే ప్రయత్నించారు.ప్రతి పౌరుడి పది చేతి వేళ్ల ముద్రలు, ఐరిస్ చిత్రాలు, ఫొటో, సుమారు 60 అంశాలతో సమాచారం పోగు చేశారు. తొలుత స్వచ్ఛందమేనన్నా మెల్లమెల్లగా అన్నిటికీ ఇదే ఆధారమయ్యేలా చేశారు. వ్యతిరేకత రావడంతో 2010లో డేవిడ్ కామెరూన్ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి.. ఆ సమాచారం ఉన్న 500 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసింది. మరోవైపు చైనా తన ప్రజలకు ‘క్రెడిట్ కోడ్', గుర్తింపు కార్డులిస్తోంది. ఉద్యోగం, రుణం కావాలన్నా.. దేనికైనా అనుమతి ఇవ్వాలన్నా, బాధ్యత అప్పగించాలన్నా ప్రతిదీ దీనికే ముడిపెట్టే పరిస్థితులు రానున్నాయి. ఆన్లైన్లో కార్యకలాపాలు సాగించే సుమారు 70 కోట్ల మంది సమాచారం ప్రభుత్వం చేతికి వెళ్తుంది. ప్రజలపై ప్రభుత్వానికి పూర్తిగా పట్టుచిక్కుతుంది. ప్రపంచంలోని 50కిపైగా దేశాల్లో జాతీయ గుర్తింపు నమోదు సంఖ్యల విధానం ఉంది. అమెరికాలో సామాజిక భద్రత సంఖ్య పేరిట గుర్తింపు కార్డులు 1936 నుంచి ఉన్నాయి. దీనిని పథకాలకు ముడిపెట్టినా అది ఐచ్ఛికమే.