మ్యూజియంగా సంగారెడ్డి జైలు: కెసిఆర్ వివరాలు
హైదరాబాద్: 200ఏళ్ల చరిత్ర కలిగిన సంగారెడ్డి జైలు త్వరలో మ్యూజియంగా సేవలు అందించనుంది. మే మొదటి వారంలో మ్యూజియం ప్రారంభం కానుంది. నిజాం కాలం నుంచి ఈ జైలులో ఖైదీలుగా ఉన్న ప్రముఖ వ్యక్తుల పేర్లు వారి వివరాలను మ్యూజియంలో ప్రదర్శించనున్నారు.
సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి రామలింగరాజు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ, లాంటి ఇతర నేతల పేర్లను ప్రముఖ ఖైదీల జాబితాలో చేర్చే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు జైలు జీవితం గడిపిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పేరు, వివరాలు పొందుపర్చనుండటం గమనార్హం. ప్రముఖ రచయిత దాశరథి కృష్ణమాచార్యులు అలియాస్ దాశరథి, కవి కాళోజీ నారాయణరావు అలియాస్ కాళోజీ లాంటి ప్రముఖుల తోపాటు కెసిఆర్ పేరు, వివరాలు మ్యూజియంలో ప్రదర్శించబడతాయి.
కెసిఆర్, దాశరథి, కాళోజీ లాంటి వారే కాకుండా మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, మరో 50 మంది ఖైదీల వివరాలను మ్యూజియం గోడలపై ప్రదర్శించనున్నారు. అయితే ఇటీవలి కాలంలో జైలు జీవితం గడిపిన రామలింగరాజు, జగన్మోహన్ రెడ్డి, ఉగ్రవాది యాసిన్ భత్కల్ లాంటి వారి పేర్లు, వివరాలను ఇక్కడ పొందుపర్చడం లేదు.
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన, తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం పాటుపడిన ప్రముఖుల పేర్లనే ఇక్కడ ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. నిజాం కాలంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖుల పేర్లను కూడా మ్యూజియంలో ప్రదర్శించనున్నారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ 2009లో ఖమ్మం జైలులో కూడా కొన్ని రోజులపాటు గడిపారు. మ్యూజియంగా మారిన సంగారెడ్డి జైలు ప్రారంభానికి సిద్ధంగా ఉందని జైలు డైరెక్టర్ జనరల్ వికె సింగ్ తెలిపారు. మ్యూజియాన్ని ప్రారంభించేందుకు సిఎం కెసిఆర్ను ఆహ్వానించినట్లు తెలిపారు.
తెలంగాణ జైళ్ల చరిత్ర, కళలు, జైలు జీవితం గడిపిన ప్రముఖుల వివరాలు, ఇక్కడ తయారు చేబడిన పలు ఉత్పత్తులను, ఫొటోలను మ్యూజయంలో ప్రదర్శించనున్నట్లు వికె సింగ్ తెలిపారు.