అదిరిపోయే మెట్రో ఛార్జీలు, 200% ఎక్కువ: అక్కడే మతలబు, ఎక్కడ ఎలా ఉన్నాయంటే?
మెట్రో రైలు ఛార్జీలు ఎలా ఉంటాయనే ఆసక్తి శనివారం వరకు అందరిలో కనిపించింది. మెట్రో ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే, సామాన్యులు ఊహించిన దాని కంటే, మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం కంటే ఈ ధరలు ఎంతో ఎక్
హైదరాబాద్: మెట్రో రైలు ఛార్జీలు ఎలా ఉంటాయనే ఆసక్తి శనివారం వరకు అందరిలో కనిపించింది. మెట్రో ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే, సామాన్యులు ఊహించిన దాని కంటే, మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం కంటే ఈ ధరలు ఎంతో ఎక్కువగా ఉన్నాయి. గతంలోని ఒప్పందం కంటే 200 శాతం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
మరిన్ని హైదరాబాద్ మెట్రో సంగతులు చదవండి

10 శ్లాబులుగా విభజించారు
కనీస ఛార్జీ రూ.10 కాగా గరిష్ఠంగా రూ.60గా నిర్ణయించారు. దూరాన్ని బట్టి 10 శ్లాబులుగా విభజించారు. ఛార్జీల పట్టికను ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు వెల్లడించింది. రెండు కి.మీ. వరకు కనీస ఛార్జీ రూ.10 వసూలు చేస్తారు. 26 కి.మీ.పైన రూ.60గా నిర్ణయించారు.

ప్రతి శ్లాబుకు రూ.5 పెంపు
ప్రతి శ్లాబుకు ఐదు రూపాయలు పెంచుతూ వెళ్లారు. 4 కి.మీ. నుంచి 6 కి.మీ. వరకు ఉన్న శ్లాబును మాత్రం ఏకంగా పది రూపాయలు పెంచారు. మొదటి పది కి.మీ. వరకు ప్రతి రెండు కి.మీ. ఒక శ్లాబుగా విడదీయగా ఆ తర్వాత నాలుగు కి.మీ. ఒక శ్లాబుగా చేశారు.

ఒప్పందం ప్రకారం అలా, ఇప్పుడు మార్పులు
ప్రాజెక్టు ప్రారంభంలో ఒప్పందం ప్రకారం ప్రయాణ ఛార్జీలు 6 స్లాబుల్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు 10 స్లాబులకు పెంచారు. మొదటి శ్లాబు దూరంలో మార్పు లేదు. రెండో శ్లాబు నుంచి 4 కి.మీ.కు ఉన్న ఒక్కో శ్లాబు నుంచి రెండేసి కిలోమీటర్లు తగ్గించి ఛార్జీలు భారీగా పెంచారు.

ఎన్నో రెట్లు పెరిగింది
2012 ఒప్పంద నాటి ధరల్లో 18 కి.మీ.పై గరిష్ఠ ఛార్జీ 19 కాగా ఇప్పుడు అది ఏకంగా రూ.60గా అయింది. నాటి ధరల ప్రకారం 6 కి.మీ. వరకు రూ.10 ఛార్జీ ఉంటే ఇప్పుడు రూ.25గా అయింది. 10 కి.మీ. ప్రయాణానికి నాటి ధరల ప్రకారం రూ.12 అయితే, ఇప్పుడు రూ.35కు పెరిగింది.

దేశవ్యాప్తంగా కనిష్ఠ, గరిష్ఠ రేట్లు ఇలాగే కానీ
దేశవ్యాప్తంగా మెట్రో ఛార్జీలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. కనీస, గరిష్ఠ ఛార్జీల్లో పెద్దగా తేడా లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కొచ్చిలలో రూ.10 నుంచి రూ.70 దాకా ఉంది. ముంబైలో మాత్రం గరిష్ఠంగా రూ.110 ఉంది. హైదరాబాదులోను అలాగే ఉంది. కనీస, గరిష్ఠ ధరల్లో తేడా లేదు. కానీ శ్లాబుల్లో మాత్రం తేడా ఉంది.

ఏ నగరంలో ఎంత అంటే
ఉదాహరణకు అన్ని నగరాల్లో తొలి రెండు కిలోమీటర్లకు రూ.10గా ఉంది. 8 నుంచి 10 కిలోమీటర్లకు హైదరాబాదులో రూ.35, ఢిల్లీలో రూ.20, బెంగళూరులో రూ.22, చెన్నై రూ.40, కొచ్చిలో రూ.30గా ఉంది. 18 నుంచి 22 కిలోమీటర్లకు వచ్చేసరికి హైదరాబాదులో రూ.50, ఢిల్లీలో రూ.40, బెంగళూరులో రూ.45, చెన్నైలో రూ.60, కొచ్చిలో రూ.50గా ఉంది.

స్మార్ట్ కార్డులు అందుబాటులోకి
కాగా, మెట్రో ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డులను ఆదివారం నుంచి నాగోల్, తార్నాక, ప్రకాశ్ నగర్, ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనుగోలు చేయవచ్చు. కార్డు ధర రూ.200. ఇందులో రూ.100 ధరావతు. మిగిలిన వంద రూపాయలు ప్రయాణానికి వినియోగించుకోవచ్చు. గరిష్ఠంగా రూ.2వేల వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. 29న ఉదయం 6 గంటల నుంచి మెట్రోలోకి ప్రయాణికులను అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications