భూమ్మీద అతి పెద్ద ముఖం.. ఈ విగ్రహానిదే, ఆవిష్కరణ ఈరోజే
శుక్రవారం శివరాత్రి సందర్భంగా కోయంబత్తూర్ లోని వెల్లియంగిరి కొండల సమీపంలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి(శివుడు) విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.
కోయంబత్తూర్: హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి మహాశివరాత్రి. శుక్రవారం శివరాత్రి సందర్భంగా కోయంబత్తూర్ లోని వెల్లియంగిరి కొండల సమీపంలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి(శివుడు) విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈషా ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగనుంది.
ఈ విగ్రహం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. భూమ్మీద ఉన్న విగ్రహాలన్నింటిలోను అతి పెద్ద ముఖం కలిగిన విగ్రహం ఇదే. అత్యంత సుందరంగానే కాకుండా ప్రత్యేకమైన కొలతలతో దీనిని రూపొందించారు.
On Mahashivratri, will be in Coimbatore to join the programme organised by @ishafoundation at the Isha Yoga Center. @SadhguruJV #Adiyogi pic.twitter.com/SZnaHbrlij
— Narendra Modi (@narendramodi) February 21, 2017
విగ్రహం ముఖాన్ని స్టీల్ తో తయారు చేశారు. కేవలం ముఖాకృతి డిజైన్ కే రెండున్నరేళ్లు పట్టిందని, ఎనిమిది నెలలపాటు శ్రమించి దీనిని తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ విగ్రహం తయారీకి ఎంతో డబ్బు వెచ్చించినట్లు తెలిపారు.
ఈ ఆదియోగి విగ్రహం బరువు సుమారు 500 టన్నులు ఉంటుంది. 112 అడుగుల ఎత్తున దీన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మనిషి తన పరిధులను అధిగమించి పరమోన్నత స్థితికి చేరుకునేందుకు మహాశివుడు 112 మార్గాలను సూచించాడు.
శాస్త్రాల ప్రకారం.. మానవ శరీరంలో 112 చక్రాలు ఉంటాయి. భూమ్మీద నాలుగు దిక్కులా ఈ ఆదియోగి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఈషా ఫౌండేషన్ సంకల్పించింది. ఇందులో భాగంగా తొలి విగ్రహాన్ని దక్షిణాన కోయంబత్తూర్ లో ఏర్పాటు చేశారు.
ఇంకా తూర్పున వారణాసిలో, ఉత్తరాల ఢిల్లీలో, పశ్చిమాన ముంబైలో ఆదియోగి విగ్రహాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు సద్గురు జగ్గీవాసుదేవ్ వెల్లడించారు.