నీటిపై తేలియాడే అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రం!
కేరళ రాష్ట్రం వాయనాడ్ లోని బనాసురా జలాశయంలో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌరశక్తి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయింది. వచ్చేనెలలో కేరళ సీఎం పినరయి విజయన్ దీనిని ప్రారంభించనున్నారు.
కోజికోడ్: కేరళ రాష్ట్రం వాయనాడ్ లోని బనాసురా జలాశయంలో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌరశక్తి విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు(కేఎస్ఈబీ). ఈ సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణానికి మొత్తం రూ.9.25 కోట్లు వెచ్చించారు.
జలాశయం నీటిపై 6 వేల చదరపు మీటర్ల పరిధిలో తేలియాడుతూ ఉండే ఈ విద్యుత్ కేంద్రం సామర్థ్యం 500 కిలోవాట్ పీక్(కేడబ్ల్యూపీ). 18 తేలియాడే ప్లాట్ ఫారమ్ లపై సోలార్ వోల్టాయిక్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు.
2016 మార్చిలో ఈ సోలార్ ప్రాజెక్టు పనులు ప్రారంభంకాగా, ఇటీవలే సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఈ సోలార్ విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు కేఎస్ఈబీ పరిశోధన, డ్యాం సేఫ్టీ ఉపవిభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మనోహరన్ తెలిపారు.
వచ్చేనెలలో కేరళ సీఎం పినరయి విజయన్ దీనిని ప్రారంభిస్తారని కేఎస్ఈబీ అధికారులు తెలిపారు. ఆడ్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే సంస్థ ఈ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది.
''దీని వార్షిక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7.5 లక్షల యూనిట్లు. ఆర్థిక, రక్షణ కారణాలతో జలాశయం నీటిపై 11కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని నిర్మించాం. నేలపై నిర్మించే సౌర విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే నీటిపై తేలియాడే కేంద్రాలే అధిక సామర్థ్యంతో పనిచేస్తాయి..'' అని ఆడ్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు (ప్రాజెక్టులు) రవీంద్రన్ టీ నాయర్ తెలిపారు.