గుండె మార్పిడితో మహిళకు ప్రాణం పోశారు
హైదరాబాద్: వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ మహిళకు కొత్త జీవితాన్ని అందించారు. బైపాస్ సర్జరీకి పట్టేంత సమయంలోనే ఓ మహిళకు వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఓ బ్రెయిన్డెడ్ రోగి నుంచి తొలగించిన గుండెను ఆ మహిళకు అమర్చారు. ఆ తర్వాత రెండు గంటల్లో రక్తప్రసరణ మొదలైంది. ఆ వెను వెంటనే ఆమెకు అమర్చిన హార్ట్ లంగ్ పంపింగ్ మిషన్ తొలగించారు. అవయవాల పనితీరు మెరుగుపడడంతో ఏడు గంటల్లోనే కృత్రిమ శ్వాస కూడా నిలిపివేశారు. ఇక రెండో రోజు నుంచే ఆ గృహిణి నడవడం మొదలు పెట్టింది.
ఈ నెల 16న యశోద ఆస్పత్రి వైద్యులు ఈ ఘనత సాధించారు. ఆస్పత్రి చీఫ్ కార్డియోథోరాసిక్ సర్జన్, గుండె మార్పిడి, చిన్న కోత శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ ఏజీకే గోఖలే గుండెమార్పిడి విధానాన్ని మంగళవారం మీడియా ప్రతినిధులకు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన వెంకట రమ్య(25)కు మొదటి ప్రసవం తరువాత గుండె సమస్య మొదలైంది. ఆరేడేళ్లుగా గుండెదడ, నడిస్తే ఆయాసం, నాలుగు అడుగులు వేయలేని స్థితి, గట్టిగా ఊపిరిపీల్చుకోని పరిస్థితితో ఆమె బాధపడుతున్నారు.
చివరి ప్రయత్నంగా ఆమె యశోద ఆస్పత్రి వైద్య నిపుణులను సంప్రదించింది. ఆమె 'పోస్ట్పార్టమ్ కార్డియోమయోపతీ' (గర్భధారణ సమయంలో వచ్చే గుండెజబ్బు)తో బాధపడుతున్నట్టు వారు నిర్ధారించారు. మామూలుగా 5-6 లీటర్ల రక్తప్రసరణ జరగాల్సిన సమయంలో లీటర్ రక్తమే ఆమె గుండెకు అందుతోంది. దీనివల్ల రోజురోజుకూ ఆమె గుండె స్పందన తగ్గిపోయి బలహీనంగా మారిపోయింది. దీంతో వైద్యులు ఆమెకు గుండె మార్పిడి తప్పదనే నిర్ధారణకు వచ్చారు. గుండెదాత కోసం 'జీవన్దాన్'కు సమాచారం అందించారు.
హైదరాబాద్ లక్డీకాపూల్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో 21 ఏళ్ల యువకుడు బ్రెయిన్డెత్కు గురవడంతో.. అవయవ దానం కోసం జీవన్దాన్ సభ్యులు అతడి కుటుంబసభ్యులను ఒప్పించారు. ఆ యువకుడి హృదయాన్ని గుండెమార్పిడి అత్యవసరమైన 19ఏళ్ల యువకుడికి అమర్చాలని నిర్ణయించారు. కానీ, అంతలోనే ఆ యువకుడు మరణించడంతో గుండెను రమ్యకు అమర్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 16న రాత్రి 9.30 గంటలకు లక్డీకాపూల్లోని ఆస్పత్రిలో గుండెను తీసుకుని ప్రత్యేక బాక్స్లో పెట్టుకుని అంబులెన్స్లో ట్రాఫిక్ పోలీసుల సాయంతో ఎనిమిది నిమిషాల్లో యశోద ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే 16 మంది వైద్యులు శస్త్రచికిత్స ప్రారంభించారు.
బలహీనమైన రమ్యగుండెను తొలగించి, ఆమెకు హార్ట్, లంగ్ పంపింగ్ మిషన్ను అమర్చారు. దాదాపు రెండు గంటల పాటు ఈ మిషన్ ద్వారా ఆమెకు కృత్రిమ స్పందనలు కల్గిస్తూ గుండె మార్పిడి ప్రక్రియను నిర్వహించారు. ప్రస్తుతం రమ్య పూర్తిగా కోలుకుందని, ఏడాది వరకూ ఎటువంటి ఇన్ఫెక్షన్, ఇతర వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.