ప్రభుత్వ నైతిక ఓటమి
స్థానిక సంస్థల ఎన్నికలను యథావిధిగా నిర్వహించడానికి అనుమతిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. అంత మాత్రాన ప్రభుత్వానికి అది పూర్తి క్లీన్చిట్ అవుతుందా? కాదనేది హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన కారణాలే తెలియజేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఆపడానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఇది వరలో ఇచ్చిన తీర్పు దృష్టాంతంగా ఉన్నందున, నిర్ణీత గడువులోగా స్థానిక సంస్థలకు పాలకమండళ్లు ఏర్పడాలని రాజ్యాంగం నిర్దేశించినందున మాత్రమే హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికలను అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చింది. అది కూడా కేవలం సాంకేతిక కారణాల వల్ల ఆ ఉత్తర్వులు ఇచ్చిందనేది అర్థమవుతోంది.
హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వుల వల్ల ఎన్నికల కమీషన్కు ఊరట లభించింది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు సంబంధించి అధికార పార్టీ పాత్ర గురించి, ఎన్నికల కమీషన్ అధికార పరిధి గురించి సింగిల్ జడ్జి తీర్పు చర్చ జరడానికి సదవకాశాన్ని కల్పించింది. తప్పుడు తడకల ఓటర్ల జాబితాలకు సంబంధించి, ఎన్నికల జాబితాల్లో జరిగిన అక్రమాలపై సింగిల్ జడ్జి చాలా వివరంగా తన తీర్పులో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నూటికి నూరు శాతం తప్పులు లేకుండా ఉండడం అనేది అందరూ అంగీకరించే విషయమే. అయితే ఉద్దేశ్యపూర్వకంగా తప్పులకు పాల్పడే పరిస్థితిని సృష్టించడం అనేది ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల పేర్లు జాబితాల్లోంచి గల్లంతు కావడమనేది ఈ సమయంలో చాలా స్పష్టంగా బయటపడింది.
ఎన్నికల ప్రక్రియ ఆగకపోయినప్పటికీ నైతికంగా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయినట్లే లెక్క. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఓటర్ల జాబితాల తయారీలో అక్రమాలకు పాల్పడిందనేది చాలా స్పష్టంగా వెల్లడైంది. రేపు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రభుత్వం మాత్రం ఓడిపోయినట్లే. ప్రభుత్వ ఒత్తిడి వల్లనే ఓటర్ల జాబితాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని రెవెన్యూ ఉద్యోగుల సంఘం కూడా ఆరోపించింది. ఇది ప్రభుత్వ పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నెల 27వ తేదీ తర్వాత తదుపరి విచారణ జరుగుతుందని డివిజన్ బెంచ్ తెలియజేసింది.