కెసిఆర్ వ్యూహం?
సమయం ఎక్కువగా లేనందున తెలంగాణ సాధించడమో, కాంగ్రెస్ ను ఎండగట్టడమో మాత్రమే తమకు మిగిలి ఉందని ఆయన బిజినెస్ స్టాండర్డ్ ప్రతినిధి దశరథ రెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాంగ్రెస్ ద్రోహాన్ని ఎండగడుతామని ఆయన అన్నారు. ఉత్తరాది నుంచి తనకు మద్దతుగా ఎన్నో ఉత్తరాలు వచ్చాయని ఆయన చెప్పుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కూడా తనకు మద్దతు ప్రకటించారని ఆయన చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని తనకు విజ్ఞప్తులు కూడా వచ్చాయని ఆయన చెప్పుకున్నారు.
మార్చి 6వ తేదీన తాము రాజీనామాలు చేస్తే ఆ నియోజరవర్గాలకు ఉప ఎన్నికలు జరపాల్సి వస్తుందని, ఆ ఉప ఎన్నికల్లో తామేమిటో కాంగ్రెసుకు చూపాలని ఆయన ఆశిస్తున్నారు. కరీంనగర్ లోకసభ ఉప ఎన్నిక ద్వారా తిరిగి బలాన్ని సంతరించుకున్నట్లుగా ఈ ఉప ఎన్నికల ద్వారా మరో సారి బలాన్ని నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. నియోజరవర్గాల పునర్విభజన వల్ల తెలంగాణలో పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. అంతే కాదు, పునర్విభజన తీరు తెరాసకు అనుకూలించే విధంగా కూడా ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో సాధ్యమైనన్ని సీట్లు సాధించాలని ఆయన అనుకుంటున్నారు. దాని వల్ల జాతీయ పార్టీలు మద్దతు కోసం తమ వద్దకు రాక తప్పదని ఆయన చెబుతున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఢిల్లీ రాజకీయాలు హైదరాబాదులో తమ పార్టీ కార్యాలయం తలుపులు తడతాయని ఆయన దశరథ రెడ్డితో అన్నారు.
అంతేకాదు, వచ్చే ఎన్నికల నాటికి పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ రాజకీయ నాయకులంతా ఒక్కటవుతారని ఆయన భావిస్తున్నారు. తెలుగుదేశంలో మొదలైన తెలంగాణ రగడ, కాంగ్రెసులో చెలరేగిన తెలంగాణ దుమారం కెసిఆర్ కు ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నట్లున్నాయి. అయితే తెలంగాణపై కాంగ్రెస్ వ్యూహాలు, ఎత్తుగడలు కెసిఆర్ కే కలిసి వచ్చేట్లుగా ఉన్నాయి.