కాంగ్రెస్ అస్తిత్వానికి పరీక్ష
గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు తెలఅంగాణ ఉద్యమానికి ఊపిరి అందించాయి. ఇక యుపిఎ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు తెలంగాణ అనేది తీరని కలే అని సగటు తెలంగాణ తెలంగాణ వాడి ఆశలు చంపుతున్న దశళో ఒక దాని తర్వాత జరుగుతున్న ఘటనలు ఎక్కడో ఆ ఆశని సజీవంగా ఉంచగలుగుతున్నాయి. మొట్ట మొదట చెప్పుకోవాల్సిన సంఘటన ప్రొఫెసర్ జయశంకర్ రాజీనామా. కె. చంద్రశేఖర్ రావు చెబుతున్నట్టు అనారోగ్యం వల్లనైతేనేమి, మీడియా చెబుతున్నట్టు అసంతృప్తి వల్లనైతేనేమి ఒక నిజమైన తెలంగాణ మేధావి పదవిని వదిలి క్షేత్ర రంగానికి రావడం శుభసూచకం. రాష్ట్రానికి తిరిగి వచ్చిన జయశంకర్కు లభిచంన సాదర ఆహ్వానాన్ని పరికిస్తే తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఉద్యమం మీద ఇంకా ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. కల్మషం లేకుండా పోరాడేవారిని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని దీనితో తెలిసిపోతున్నది. కెసిఆర్, నరేంద్ర ద్వయం దీని నుంచడి అయినా ఏమైనా నేర్చుకుంటారా చూడాలి.
ఇక చెప్పుకోవాల్సిన మరో సంఘటన - ఉస్మానియా యూనివర్శిటీలో పోలీసువారి అత్యుత్సాహం. హోలీ జరుపుకుంటున్న తెలంగాణ విద్యార్థులు, ప్రొఫెసర్ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఒక్క తాటిపై నిలిచి ఖండించడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ సంఘటనపై నిరసన చూసినవారికి తెలంగాణ ఉద్యమం ప్రశాంతంగా ఉందే గాని అంతరించి పోలేదని తెలియజెప్పింది. అలాగే జీవో 72 విషయంలో ప్రతి పక్షాలన్నీ ఒక్కటై దాన్ని సస్పెండ్ చేయించిన తీరు కూడా మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే హైదరాబాద్లో బిజెపి అధినేత రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక తెలంగాణకి సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం మరొక ఎత్తు. రాజ్నాథ్ ప్రకటన ఎంత స్పష్టంగా ఉందంటే కరడు గట్టిన తెలంగాణ వ్యతిరేకులకు కూడా గుండెల్లో గుబులు రేపింది. ఎక్కడా డొంక తిరుగుడు లేకుండా ముక్కు సూటిగా తన అభిప్రాయాన్ని తెలియజేశారాయన. ఆయన ప్రకటన వెనక తెలంగాణ బిజెపి నాయకులైన ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ లాంటి వారి ప్రయత్నమే కాకుండా, ఆర్యస్యస్ ఛీఫ్ సుదర్శన్జీ సలహా, కెసిఆర్, నరేంద్రల దౌత్యం కూడా ఉన్నాయి. లేఖ ఇస్తేనే కాని మేం లెక్క చేయం అనే డొంక తిరుగుడు కారణాలను కాంగ్రెస్ ఎక్కువ రోజులు చెప్పే పరిస్థితి లేదు. ఈ వారంలో వరంగల్లో వరంగల్లో బిజెపి ఆధ్వర్యంలో జరిగిన మేధావుల, ఉద్యోగుల సమ్మేళనమే మారుతున్న సమీకరణలకి సూచిక.
బిజెపి గ్రామ గ్రామన తిరుగుతూ ఉద్యమాన్ని నిర్మిస్తుంటే, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెట్టకమానవు. ప్రజలకు కావాల్సింది తెలంగాణనే కాని పార్టీ సిద్ధాంతాలు కాదని గడిచిన పంచాయతీ ఎన్నికల్లో టి ఆర్యస్ అఖండ విజయమే చెబుతోంది. అతి త్వరలోనే తెలంగాణకి చెందిన టి ఆర్యస్/ కాంగ్రెస్ క్యాడర్ అంతా బిజెపి వెనక నిలబడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమ తమ క్యాడర్ని ఎలాత నిలబెట్టుకోవాలనే విషయం కెసిఆర్, టిఆర్సిసిసి నాయకుల నిర్ణయం మీద ఆధారపడి వుంది. టి ఆర్యస్ నాయకులు ఇప్పటికైనా డెడ్లైన్లు పెట్టకుండా చేసేదేదో చేసి చూపెట్టాలి. నేరుగా సోనియా గాంధీ దగ్గరకు వెళ్లి అటో ఇటో తేల్చుకోవాలి. జయశంకర్ దారిలో నడవాలి. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా బిల్లు తెచ్చేటట్లు హైకమాండ్ మీద ఒత్తిడి తేవాలి. ప్రతి పార్టీ కూడా స్పష్టంగా మద్దతు ఇస్తున్నప్పుడు ఇంకా మేము సోనియాజీ చేతిలో పెట్టాము, ఆమె ఎలా అంటే అలా నే పాత డైలాగ్లు చెప్పుకుంటూ పోతే తెలంగాణలో వాళ్ల అస్తిత్వం అదృశ్యం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.
- సి. శ్రీనివాస్