అదును కోసం చంద్రబాబు నిరీక్షణ

రోశయ్య ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి కూడా ఎక్కువ వేగంతో సాగకూడదనేది ఆయన భావిస్తున్నారు. కాగల కార్యం జగన్ వర్గం చేసి పెడుతుందనేది ఆయన ఆశగా కనిపిస్తోంది. కాంగ్రెసు అంతర్గత కలహాలు ఒక స్థితికి చేరుకునే వరకు ఆగాలని ఆయన భావిస్తున్నారు. నిజానికి, రోశయ్య శాసనసభ విశ్వాసాన్ని పొందాలనే డిమాండ్ పెట్టాలని కొంత మంది పార్టీ నాయకులు చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం. అటువంటి డిమాండ్ పెడితే అధికారం కోసం తొందరపడుతున్నారనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుందని, అందువల్ల తాము తొందర పడకూడదని చంద్రబాబు అంటున్నట్లు సమాచారం.
జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెసు శాసనభ్యులు, మంత్రులు ఎంత దూరం వెళ్తారనేది వేచి చూడాలని, ఈలోగా పార్టీని పటిష్టపరుచుకోవాలని ఆయన భావిస్తున్నారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం కాంగ్రెసు అంతర్గత కలహాల విషయంలో ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది. జగన్ వర్గీయులు రోశయ్యపై తిరుగుబాటు చేస్తారా, లేదా అనేది దీంతో తేలిపోతుంది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినా కూడా ఆ విషయం తెలిసిపోతుంది. కాంగ్రెసు స్వయంగా తన గోతిని తానే తవ్వుకుంటున్నప్పుడు తాము తొందరపడడం ఎందుకనేది చంద్రబాబు మతంగా కనిపిస్తోంది. అంత దాకా వేచి చూడడమే మంచిదని ఆయన పార్టీ నాయకులతో అంటున్నారట.












Click it and Unblock the Notifications