చిరు సీమాంధ్ర పావు

Chiranjeevi
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అకస్మాత్తుగా తెలంగాణపై తిరగబడ్డారు. అలా తిరగబడడం వెనక పనిచేసిన శక్తులేమిటనేది అర్థం కావడం లేదు. కానీ చిరంజీవి కాస్తా రాజకీయంగా ఒక ప్రాంతం హీరో మాత్రమే అయ్యారు. సమైక్యాంధ్ర నినాదంతో ఆయన సీమాంధ్రలో విస్తృతంగా పర్యటించారు. తెలంగాణలో పర్యటించి తీరుతానని పదే పదే ప్రకటిస్తున్నారు. తెలంగాణలో సమైక్య నినాదాన్ని వినిపిస్తానని చెబుతున్నారు. బహుశా అందులో భాగంగానే కావచ్చు, సోమవారం హైదరాబాదులోని అంబర్ పేటలో తన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని తెలంగాణకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ నివాదం ఆయనను రాజకీయంగా అందరివాడిని చేసి అధికారానికి సన్నిహితం చేస్తుందనేది అనుమానమే. ఎందుకు ఆయన ఈ ప్రమాదకరమైన రాజకీయ క్రీడను మొదలు పెట్టారనేది అంతు పట్టకుండా ఉంది. చివరకు ఆయన సీమాంధ్ర నాయకుల చేతిలో పావుగా మాత్రమే ఉపయోగపడే అవకాశం ఉంది. అంతకు మించి, వ్యక్తిగతంగా చిరంజీవికి ఒరిగేదేమీ ఉండదు.

పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని ఓడించి, కాంగ్రెసు అధికారంలోకి రావడానికి ఆయన ఉపయోగపడినట్లు స్పష్టంగా తెలిసిపోతూనే ఉన్నది. ఇప్పుడు సీమాంధ్ర నేతల ప్రయోజనాలకు ఆయన ఉపయోగపడే వ్యూహాన్ని రూపొందించుకుని ఆచరిస్తున్నారు. నిజానికి, చిరంజీవి పార్టీ విషయంలో సరైన సామాజిక వర్గ విశ్లేషణతో ముందుకు సాగకపోవడం వల్లనే ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు సాధించింది. కోస్తాంధ్రలో కమ్మ, కాపు వర్గాల మధ్య నిరంతర వైరం ఉంది. ఈ రెండు వర్గాలు ఎన్ని రకాలుగా చూసినా రాజకీయంగా ఒక్కటి కావడం కష్టం. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే అనుమానంతో కాపు వర్గానికి చెందిన ఓటర్లు కాంగ్రెసు పార్టీకి ఓట్లు వేసినట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పటి వరకు రాజ్యాధికారాన్ని అనుభవించిన, అనుభవిస్తున్న రెడ్డి, కమ్మ వర్గాలను కాదని అధికారంలోకి రావడానికి కాపు వర్గానికి అవకాశం ఉంటుందని సోషలిస్టులు అంచనా వేశారు. వారి విశ్లేషణను చిరంజీవి సారంలో గ్రహించలేకపోయారు. దాని వల్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారందరినీ పార్టీలో చేర్చుకుంటూ పోయారు. అది మొదటికే మోసం తెచ్చి పెట్టింది.

నిజానికి, తెలంగాణలోని వెలమ, కోస్తాంధ్రలోని కాపు వర్గాలు రాజకీయంగా ఒక్కటైతే రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వీలవుతుందనేది ఒక అంచనా. తెలంగాణలోని వెలమ వర్గం పూర్తిగా తెలంగాణ నినాదాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఇది అదికారానికి దగ్గరయ్యే ఎత్తుగడనే. చిరంజీవి అధికారంలోకి రావాలని అనుకుంటే తెలంగాణ నినాదాన్ని తీసుకుని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ముందుకు సాగాల్సి ఉండింది. కానీ అందుకు విరుద్ధంగా చిరంజీవి వ్యవహరించారు. కమ్మ, రెడ్ల రాజకీయ ఎత్తుగడల్లో ఆయన చిత్తయ్యారు. మరోవైపు తెరాసను కూడా దెబ్బ తీశారు. తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ కమ్మ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని, కాంగ్రెసు రెడ్లకు ప్రాతినిధ్యం వహిస్తుందవి ఒక విశ్లేషణ. ఈ స్థితిలో తెలంగాణ విషయంలో నారా చంద్రబాబు నాయుడు రెండు వైపులా కాళ్లు పెడితే, దాని వెనక నడుస్తున్న సిపిఎం సమైక్య నినాదాన్ని వినిపిస్తుంది. ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడవచ్చు. కాంగ్రెసుకు చిరంజీవి సమైక్య నినాదం కాంగ్రెసుకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. అంతకు మించి చిరంజీవి సాధించే ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+