తెలంగాణకే ఆంధ్ర దళితులు
తెలంగాణలో కులాల హద్దులు దాటి రాష్ట్ర విభజన కోసం ఉద్యమిస్తుండగా, సమైక్యాంధ్రపై కోస్తాంధ్రలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. సమైక్యాంధ్ర కోసం తెంలగాణవారి సానుకూల అభిప్రాయం కూడా అవసరం ఉండగా, కోస్తాంధ్రలోనే అందరి అభిప్రాయం ఒక్కటిగా లేకపోవడం సీమాంధ్ర ఉద్యమానికి గొడ్డలి పెట్టే. సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తున్నారు. కానీ, ఆ ఉద్యమంలో తాము భాగస్వాములు కాలేమని దళితుల తరఫున విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జాన్ స్పష్టం చేశారు. తాము తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) కోస్తాంధ్ర నేతలు, కార్యకర్తలు కచ్చితంగా చెబుతున్నారు. కోస్తాంధ్ర నాయకులు హైదరాబాదులోనే పెట్టుబడులు పెట్టి తమ లాభమే చూసుకున్నారని, విశాఖపట్నాన్ని పెట్టుబడులకు ఎందుకు కేంద్రంగా ఎంచుకోలేదని దళితులు అంటున్నారు. ఎస్సీ అయిన అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్నారు.
కోస్తాంధ్రకు చెందిన ఓల్గా వంటి ప్రగతిశీల మేధావులు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్నారు. వసంత నాగేశ్వర రావు కూడా జైఆంధ్ర ఉద్యమంతో రాష్ట్ర విభజనను కోరుతున్నారు. ఆత్మగౌరవం చంపుకుని తెలంగాణతో కలిసి ఉండలేమని ఆయన అంటున్నారు. అయితే రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్న గొంతులను నొక్కేయడానికి సీమాంద్ర సమైక్యవాదులు ప్రయత్నిస్తున్నారు. ఒక ప్రైవేట్ టీవీ చానెల్ విజయవాడలో నిర్వహించిన చర్చా గోష్టిలో ఓల్గాను పూర్తిగా మాట్లాడనీయలేదు. విశాఖపట్నంలో జాన్ ను గానీ, ఎమ్మార్పియస్ నేతలను గానీ వారు పూర్తిగా తమ అభిప్రాయాలు వెల్లడించకుండా అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర నినాదంపై కోస్తాంధ్రలోనే ఏకాభిప్రాయం లేకపోవడం, తెలంగాణ నుంచి ఒక గొంతు కూడా అందుకు అనుకూలంగా లేకపోవడం సమైక్యవాదలకు ఏ మాత్రం రుచించడం లేదు.