వైయస్ జగన్ తో రాజీ యత్నాలు?

జగన్ పార్టీ వీడేదాకా ఆయనకున్న బలాన్ని అంచనా వేయలేక పోయినందుకు అధిష్టానం ఇప్పుడు పశ్చాత్తప పడుతున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఉన్నప్పుడు జగన్ ఓదార్పు యాత్రకు వచ్చిన జనాన్ని కాంగ్రెస్ జనంగా అనుకొని పొరబడినామని, పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా జగన్ కు వస్తున్న అదే ఆదరణ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసినట్టు సమాచారం. జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టడం, నాయకులు ఆయన వెంట వెళ్లడానికి పార్టీకి రాజీనామాలు చేయటం, ప్రజలు బలవంతంగా జగన్ కు మద్దతు తెలపాలని పార్టీలో ఉన్న వారిపై ఒత్తిడి తేవడం వంటి విషయాల్ని అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది.
దీంతో జగన్ కున్న ఆదరణ, అభిమానం తెలిసి వచ్చింది. అదంతా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల వచ్చినవే కానీ, కాంగ్రెస్ వేర్లు కావని నిర్ణయానికి వచ్చిన అధిష్టానం జగన్ తో రాజీ యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు ఢిల్లీ స్థాయిలోనే ఓ పెద్ద వ్యక్తిని నియమించినట్లు సమాచారం. ఆయన జగన్ తో మాట్లాడి మళ్లీ పార్టీలోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది. 2014లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న కోరిక నెరవేరాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్టంగా ఉండాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్టంగా ఉండాలంటే జగన్ తమ వెంట ఉండాలని అధిష్టానం భావిస్తుంది. జగన్ లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కు బీహార్ పరిస్థితే వస్తుందనే భయం పట్టుకుంది. అందుకే జగన్ తో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications