వైయస్ జగన్ ఆరాటం
ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన తెగ ఆరాపడిపోతున్నాడనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉన్నది. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని చూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే తన ఆశను కూడా వెంటనే బయట పెట్టేస్తారు. ఈ వైరుధ్యం బయటి లోకానికి స్పష్టం కావడం ఆయన వ్యక్తిత్వాన్ని పట్టిస్తోంది. దీన్ని అనుభవ రాహిత్యంగా చాలా మంది తీసుకోవచ్చు. పటిష్టమైన ప్రణాళిక, సహనం, సమయానికి తగిన వ్యవహార శైలి ఆయన వంటి బట్టినట్లు లేవు. తనకు అత్యధిక పార్టీ శాసనసభ్యుల మద్దతు ఉందనే కారణంతో అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తేవడం, ముఖ్యమంత్రి కె. రోశయ్యను దించడానికి ప్రయత్నాలు సాగించడం ఆయన వ్యామోహాన్ని తెలియజేస్తున్నాయని గిట్టనివారంటారు.
అయితే, వైయస్ అనుచర వర్గం వైయస్ జగన్ ను ముందుకు తోసిన మాట వాస్తవమే గానీ అందులోని సాధ్యాసాధ్యాలను జగన్ ఒక రాజకీయ నాయకుడిగా అంచనా వేసుకోలేకపోయాడు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవిని సాధించుకోవాలన్నా అందుకు తగిన పకడ్బందీ వ్యూహం ఆయనలో కొరవడింది. మెప్పించి ఒప్పించే నేర్పును ఆయన ప్రదర్శించలేకపోయారు. దాని వల్ల ఆయన బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారనే అభిప్రాయం కలిగేలా చేశారు. నిర్ణయాల్లో, ఆచరణలో స్థిరత్వం కొరవడడం ఆయన భవిష్యత్తు రాజకీయ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు.
గత 8 నెలలుగా ముఖ్యమంత్రి రోశయ్య పట్ల ఎడ మొహం పెడ మొహంగా ఉంటూ వస్తున్న జగన్ అకస్మాత్తుగా కాకపోయినా, తన వర్గం ఒత్తిడి మేరకు ఆయనతో సమావేశమయ్యారు. రోశయ్య పట్ల ఆయన వ్యవహరించిన పద్ధతి ఆయన ఆధిపత్య ప్రదర్శనను తెలియజేయడమే కాకుండా రోశయ్యను గుర్తించాల్సిన అవసరం లేదనే అహంకారాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ వ్యక్తిత్వమే చాలా మంది సీనియర్లను జగన్ కు దూరం చేసింది. అలా దూరం కావడం వల్లనే ఆయన అధికారానికి దూరమవుతూ వస్తున్నారు. భవిష్యత్తులో జరిగేది కూడా ఇదే. ఆయన ఓదార్పు యాత్ర ద్వారా ఎవరినో సాధించేది కూడా ఏమీ లేదు.